బుల్లెట్ ట్రైన్ ఇక కేవలం 2 గంటల్లో ప్రయాణం

- September 15, 2025 , by Maagulf
బుల్లెట్ ట్రైన్ ఇక కేవలం 2 గంటల్లో ప్రయాణం

న్యూ ఢిల్లీ: ఎప్పటి నుంచో ప్రయాణికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న హైదరాబాద్–బెంగళూరు బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ ఇప్పుడు నిజంగా ఆచరణలోకి వస్తోంది.ఇప్పటి వరకు ఈ రెండు మెట్రో నగరాల మధ్య రైలు ప్రయాణం దాదాపు 19 గంటలు పడుతుండగా, త్వరలో అదే ప్రయాణం కేవలం 2 గంటల్లోనే పూర్తవనుంది.

దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఈ ప్రాజెక్ట్ కోసం ఫైనల్ లొకేషన్ సర్వే ప్రారంభించారు. మొత్తం 626 కి.మీ పొడవున్న ఈ హై-స్పీడ్ రైలు లైన్ కోసం రైల్వే కన్సల్టెన్సీ సంస్థ సర్వే చేస్తోంది. సర్వే పూర్తయిన తర్వాత డీటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసి పంపనున్నారు. ఆమోదం వచ్చిన వెంటనే కన్‌స్ట్రక్షన్ టెండర్లు జారీ అవుతాయి.

ఈ లైన్‌ను గంటకు 350 కి.మీ డిజైన్ స్పీడ్ తో రూపొందిస్తున్నారు. సాధారణంగా ఇది గంటకు 320 కి.మీ ఆపరేషనల్ స్పీడ్ తో నడుస్తుంది. ముంబై–అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ లైన్ తరహాలోనే దీనిని డిజైన్ చేస్తున్నారు.

ఈ ప్రాజెక్ట్ కోసం సూచించబడిన ప్రధాన స్టేషన్లు హైదరాబాద్, మహబూబ్ నగర్, గద్వాల్, కర్నూలు, అనంతపురం, బెంగళూరు. ఇవి ఇంకా ప్రాథమిక ప్రతిపాదనలు మాత్రమే. DPR పూర్తయ్యాకే తుది నిర్ణయం తీసుకుంటారు.

ఇంత పెద్ద ప్రాజెక్ట్ కోసం కావాల్సిన భూసేకరణ ఒక పెద్ద సవాల్ అవుతుందని అధికారులు చెబుతున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈ సర్వే పనులను వేగంగా పూర్తి చేయాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ సీఎం దక్షిణ భారత ప్రధాన నగరాలను కలిపే మరో హై-స్పీడ్ నెట్‌వర్క్ ప్రణాళికను ప్రస్తావించారు.

ఇప్పటి వరకు ఒక నగరం నుంచి ఇంకో నగరానికి రోజంతా సమయం కేటాయించాల్సి వచ్చేది. కానీ ఈ బుల్లెట్ ట్రైన్‌తో కేవలం రెండు గంటల్లో చేరుకోవచ్చు. ఇది ప్రారంభమైతే దక్షిణ భారత ప్రయాణ అనుభవాన్ని పూర్తిగా కొత్త స్థాయికి తీసుకెళ్తుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com