APNRTS డైరెక్టర్–ఆపరేషన్స్ (సర్వీసెస్)గా నాగేంద్ర బాబు అక్కిలి నియామకం

- October 29, 2025 , by Maagulf
APNRTS డైరెక్టర్–ఆపరేషన్స్ (సర్వీసెస్)గా నాగేంద్ర బాబు అక్కిలి నియామకం

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ (APNRTS) “డైరెక్టర్ – ఆపరేషన్స్ (సర్వీసెస్)”గా అన్నమయ్య జిల్లా, పుల్లంపేట మండలం, అనంతయ్యగారిపల్లి గ్రామానికి చెందిన నాగేంద్ర బాబు అక్కిలిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

1983 నుండి తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా చురుకుగా కొనసాగుతున్న నాగేంద్ర బాబు అక్కిలి గారు, తన నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి నిరంతరం కృషి చేశారు. కాంగ్రెస్ ఆధిపత్యం ఉన్న ప్రాంతంలో టిడిపిని బలంగా నిలబెట్టడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. బలహీన వర్గాల అభివృద్ధి కోసం పోరాటాలు చేసి, వాటి ఫలితంగా ఒక కాలనీ స్థాపనలో విజయవంతమయ్యారు.

చదువులు పూర్తి చేసిన అనంతరం, 1991లో ఉద్యోగ కారణంగా కువైట్‌కు వెళ్లిన ఆయన, అక్కడి కువైట్ మిలిటరీలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగంలో బాధ్యతలు నిర్వహించారు. 2025లో కువైట్ మిలిటరీ సేవల నుండి పదవీ విరమణ అనంతరం భారతదేశానికి తిరిగి వచ్చి, తెలుగుదేశం పార్టీ కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొంటున్నారు.

కువైట్‌లో కూడా టిడిపి కార్యకలాపాల్లో ప్రముఖ పాత్ర పోషించిన ఆయన, హరిజన, గిరిజన, బలహీన, మైనారిటీ వర్గాలకు చెందిన ప్రవాస ఆంధ్రులను పార్టీకి అనుసంధానం చేయడంలో, వారికి సేవలు అందించడంలో విశేష పాత్ర వహించారు.ఆయన సేవలను గుర్తించి పార్టీ నాయకత్వం 2022లో ఆయనను ఎన్ఆర్ఐ టిడిపి కువైట్ అధ్యక్షుడిగా నియమించింది.
ప్రజల భాగస్వామ్యంతో కుప్పంలో 125 రోజుల పాటు ప్రతిరోజూ 500 మందికి “అన్నా క్యాంటీన్” ద్వారా భోజన సదుపాయం కల్పించిన సేవా కార్యక్రమం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టిని ఆకర్షించింది.అలాగే, 2019లో కోవిడ్ మహమ్మారి సమయంలో కువైట్‌లో అందించిన సేవలకు గుర్తింపుగా కువైట్ ప్రధానమంత్రి చేతుల మీదుగా అవార్డు అందుకోవడం ఆయన జీవితంలో గర్వకారణంగా నిలిచింది.

ప్రతి సంవత్సరం ఎన్టీఆర్ జయంతి సందర్భంగా, ఎన్‌ఆర్‌ఐ టీడీపీ కువైట్ ఆధ్వర్యంలో, ఎన్టీఆర్ సౌజన్యంతో రక్తదాన కార్యక్రమాలు నిర్వహించి, ఆర్థికంగా బలహీనులైన రోగులకు ఉచితంగా రక్తం అందించారు.ఈ కార్యక్రమాలకు కువైట్ సెంట్రల్ బ్లడ్ బ్యాంక్ సహకారం అందించింది. వందలాది మంది ప్రవాసాంధ్రులు పాల్గొని మానవతా సేవకు తోడ్పడ్డారు.
గత 20 సంవత్సరాలుగా ఆయన స్థాపించిన రాయల్ అల్ కువైట్ కంప్యూటర్స్ సంస్థ ద్వారా వందలమంది ప్రవాస యువతకు ఉచిత కంప్యూటర్ శిక్షణ అందించి, తన పరిచయాల ద్వారా వారికి ఉపాధి అవకాశాలు కల్పించడం ఆయన సేవల్లో విశేషం. ఈ గౌరవనీయ సేవలు ప్రవాసాంధ్ర సమాజంలో విశేషంగా ప్రశంసించబడ్డాయి.

ఆయన చేసిన సేవలను గుర్తించి, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, నాగేంద్ర బాబు అక్కిలిని ఏపీ ఎన్ఆర్ఐటీఎస్ “డైరెక్టర్ – ఆపరేషన్స్ (సర్వీసెస్)”గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.రైల్వేకోడూరు నియోజకవర్గంలోని పుల్లంపేట మండలం నుండి రాష్ట్ర స్థాయి పదవిని పొందిన రెండవ వ్యక్తి నాగేంద్ర బాబు అక్కిలి. తొలి వ్యక్తి ఎన్టీ రామారావు హయాంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్‌గా నియమితులైన నూకల రమేష్ బాబు కాగా, రెండవసారి చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో నాగేంద్ర బాబు అక్కిలి రాష్ట్ర స్థాయి పదవి పొందడం విశేషం. వీరిద్దరూ వెనుకబడిన వర్గాలకు చెందినవారే కావడం గమనార్హం.
నియోజకవర్గంలోని ఐదు మండలాలలో, ఇప్పటికే ఓబులవారిపల్లి మండలానికి చెందిన ముక్క రూపానంద రెడ్డి (పార్టీ ఇన్‌చార్జ్) మరియు చిట్వేలు మండలానికి చెందిన కార్పొరేషన్ చైర్మన్ పదవులు పొందగా, ఇప్పుడు పుల్లంపేట మండలం నుండి నాగేంద్ర బాబు అక్కిలి రాష్ట్ర స్థాయి పదవి పొందిన మూడవ నాయకుడిగా నిలిచారు.

ఈ సందర్భంగా నాగేంద్ర బాబు అక్కిలి మాగల్ఫ్ న్యూస్ తో మాట్లాడుతూ...“నన్ను ఏపీ ఎన్ఆర్ఐటీఎస్ రాష్ట్ర ‘డైరెక్టర్–ఆపరేషన్స్ (సర్వీసెస్)’గా నియమించి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రవాస ఆంధ్రులకు సేవ చేసే అవకాశం కల్పించిన తల్లిలాంటి తెలుగుదేశం పార్టీకి,
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,నారా లోకేష్,ఏపీ ఎన్ఆర్ఐటీఎస్ అధ్యక్షులు రవి వేమూరు, గల్ఫ్ కౌన్సిల్ అధ్యక్షులు రావి రాధాకృష్ణ, బ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్ బుచ్చి రాంప్రసాద్,ఎన్ఆర్ఐ టిడిపి కువైట్ కమిటీకి,గల్ఫ్ కౌన్సిల్ వివిధ దేశాల కమిటీలకు,
ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎన్ఆర్ఐ టిడిపి కమిటీలకు,కార్యకర్తలకు, అభిమానులకు, సానుభూతిపరులకు మరియు రాజకీయాలకు అతీతంగా సహకరించిన సంఘాలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.

ప్రపంచంలోని ఏ దేశంలో ఉన్నా, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ప్రవాసులు ఏవైనా ఇబ్బందులు ఎదుర్కొంటే వారికి తక్షణ సహాయం అందించేందుకు మరియు బీమా సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ (APNRTS)ను ఏర్పాటు చేసింది.ఎన్నారైలు ఎక్కడ ఉన్నా, వారికి ఏవైనా సమస్యలు తలెత్తిన వెంటనే స్పందించి సహాయం అందించడం ఈ సంస్థ ప్రధాన లక్ష్యం.” అని పేర్కొన్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com