వందే భారత్ విస్తరణ–నాలుగు కొత్త రైళ్లకు గ్రీన్ సిగ్నల్!

- November 01, 2025 , by Maagulf
వందే భారత్ విస్తరణ–నాలుగు కొత్త రైళ్లకు గ్రీన్ సిగ్నల్!

న్యూ ఢిల్లీ: దేశవ్యాప్తంగా వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు ప్రజాదరణను సొంతం చేసుకుంటున్నాయి. తక్కువ సమయంలో గమ్యస్థానానికి చేరుకునే సౌకర్యం కారణంగా వీటిపై ప్రయాణికుల ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో రైల్వే శాఖ మరో నాలుగు కొత్త వందే భారత్ సర్వీసులకు ఆమోదం తెలిపింది. ఈ కొత్త సర్వీసులు ప్రారంభమయ్యాక, దేశవ్యాప్తంగా వందే భారత్ రైళ్ల మొత్తం సంఖ్య 164కు చేరుకోనుంది. రైల్వే అధికారులు ఈ సమాచారాన్ని ధృవీకరించారు.

కొత్తగా ఆమోదం పొందిన మార్గాలు
కేంద్ర రైల్వే బోర్డు ఆమోదం తెలిపిన ఈ నాలుగు కొత్త రూట్లు అనేక రాష్ట్రాల మధ్య కనెక్టివిటీని బలోపేతం చేయనున్నాయి:

బెంగళూరు–ఎర్నాకులం: కర్ణాటక, కేరళ రాష్ట్రాల మధ్య అనుసంధానాన్ని పెంచుతుంది.
ఫిరోజ్‌పూర్ కాంట్–ఢిల్లీ: పంజాబ్‌ను జాతీయ రాజధానితో కలుపుతుంది.
వారణాసి–ఖజురాహో: ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ మధ్య ప్రయాణ సంబంధాలను మెరుగుపరుస్తుంది.

లక్నో–సహరాన్‌పూర్: ఉత్తరప్రదేశ్ అంతర్గత ప్రాంతాల్లో కనెక్టివిటీని బలోపేతం చేస్తుంది.
ఈ కొత్త మార్గాల ద్వారా ప్రయాణికులు తక్కువ సమయంలో, సౌకర్యవంతంగా ప్రయాణించే అవకాశం పొందనున్నారు.

ఆధునిక సౌకర్యాలు, భద్రతా ప్రమాణాలు
కొత్త వందే భారత్ రైళ్లు కూడా అత్యాధునిక సాంకేతికతతో రాబోతున్నాయి. ప్రమాదాల నివారణ కోసం కవచ్ ఆటోమేటిక్ సేఫ్టీ సిస్టమ్, UV-C ఆధారిత క్రిమిసంహారక ఎయిర్ కండిషనింగ్ యూనిట్లు, ఫైర్ సేఫ్టీ సిస్టమ్స్, అన్ని కోచ్‌లలో సీసీటీవీ కెమెరాలు, అత్యవసర అలారం బటన్లు ఏర్పాటు చేశారు. ఈ రైళ్లు గరిష్ఠంగా గంటకు 180 కి.మీ వేగం సాధించగలవు. వికలాంగ ప్రయాణికుల కోసం ప్రత్యేక మరుగుదొడ్లు కూడా అందుబాటులో ఉంటాయి.

పెరుగుతున్న డిమాండ్
గణాంకాల ప్రకారం వందే భారత్ టికెట్ల బుకింగ్ సామర్థ్యం 2024-25లో 102%, 2025-26లో 105% దాటింది. ఇది ఈ రైళ్లపై ఉన్న ప్రజాదరణను స్పష్టంగా తెలియజేస్తోంది. కొత్తగా ఆమోదం పొందిన ఈ రైళ్ల ప్రారంభ తేదీలు త్వరలోనే ప్రకటించనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com