మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు

- November 05, 2025 , by Maagulf
మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్: మీర్జాగూడ సమీపంలో జరిగిన ఘోర బస్సు ప్రమాదం పై తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి స్పష్టత ఇచ్చారు. ఆయన ఈరోజు ప్రమాద స్థలాన్ని స్వయంగా పరిశీలించి, అక్కడి పరిస్థితులను అంచనా వేశారు. టిప్పర్ వాహనం అతివేగంగా నడిపించడమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని తెలిపారు. “ఇక్కడి రోడ్డు మలుపు కొంత ఉన్నప్పటికీ, ప్రమాదం జరిగేంత కఠినమైనది కాదు. డ్రైవర్ నిర్లక్ష్యం మరియు వేగం నియంత్రణ లేకపోవడమే ప్రాణనష్టం దారితీసింది” అని డీజీపీ వివరించారు.

శివధర్ రెడ్డి మాట్లాడుతూ, టిప్పర్ వాహన పరిస్థితిని పూర్తిగా పరిశీలిస్తున్నామని చెప్పారు. వాహనం టెక్నికల్ ఫిట్‌నెస్, బ్రేక్ సిస్టమ్, డ్రైవర్ లైసెన్స్ మరియు డ్రైవింగ్ హిస్టరీ వంటి అంశాలపై దర్యాప్తు కొనసాగుతోందని వెల్లడించారు. ఈ ఘటనలో దోషులు ఎవరో తేల్చి, కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

డీజీపీ శివధర్ రెడ్డి ప్రజలకు మరియు డ్రైవర్లకు హెచ్చరిక జారీ చేశారు. ఆయన మాట్లాడుతూ, “రోడ్డు ప్రమాదాలు ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదు, ప్రతి పౌరుడి బాధ్యత. డ్రైవర్‌లు తమ శారీరక స్థితి, మానసిక స్థితి మరియు వాహనం పరిస్థితిని ముందుగానే అంచనా వేసుకోవాలి” అని సూచించారు. అలాగే, డ్రైవర్లు అలసట లేదా ఒత్తిడిలో వాహనాలు నడపరాదని, నిర్దిష్ట వేగ పరిమితులను తప్పక పాటించాలని సూచించారు.“ఒక్క నిర్లక్ష్యం అనేక ప్రాణాలను బలి తీసుకోవచ్చు. అందువల్ల ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా వ్యవహరించాలి” అని ఆయన హితవు పలికారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com