మాలిలో ఐదుగురు భారతీయుల కిడ్నాప్ చేసిన గుర్తుతెలియని దుండగులు

- November 08, 2025 , by Maagulf
మాలిలో ఐదుగురు భారతీయుల కిడ్నాప్ చేసిన గుర్తుతెలియని దుండగులు

మాలి: పశ్చిమ ఆఫ్రికా దేశమైన మాలిలో దారుణం చోటుచేసుకుంది. గురువారం నాడు పశ్చిమ మాలిలోని కోబ్రి పట్టణ సమీపంలో గుర్తుతెలియని దుండగులు ఐదుగురు భారతీయ పౌరులను కిడ్నాప్ చేశారు. ఈ విషయాన్ని అక్కడి భద్రతా వర్గాలు శుక్రవారం వెల్లడించగా, బాధితులు పనిచేస్తున్న కంపెనీ కూడా ధ్రువీకరించింది.

కిడ్నాప్‌కు గురైన బాధితులు ఒక విద్యుదీకరణ ప్రాజెక్టులో కార్మికులుగా పనిచేస్తున్నారు. గురువారం ఆయుధాలతో వచ్చిన కొందరు దుండగులు వారిని బలవంతంగా అపహరించుకుపోయారు. ఈ ఘటనతో అప్రమత్తమైన యాజమాన్యం, కంపెనీలో పనిచేస్తున్న మిగతా భారతీయులను ముందుజాగ్రత్త చర్యగా రాజధాని బమాకోకు సురక్షితంగా తరలించినట్లు కంపెనీ ప్రతినిధి ఒకరు తెలిపారు.

దేశంలో భద్రతా సమస్యలు, ఉగ్రవాద ముప్పు
ప్రస్తుతం మాలి సైనిక పాలనలో ఉంది. దేశంలో అల్-ఖైదా, ఇస్లామిక్ స్టేట్ వంటి ఉగ్రవాద సంస్థల కార్యకలాపాలు, నేర ముఠాల దాడులు తీవ్రంగా పెరిగిపోయాయి. దీంతో దేశంలో భద్రతా పరిస్థితి క్షీణించింది. విదేశీయులను లక్ష్యంగా చేసుకుని కిడ్నాప్‌లకు పాల్పడటం ఇక్కడ సర్వసాధారణంగా మారింది. ఇప్పటికే ఈ కిడ్నాప్‌కు ఏ సంస్థ బాధ్యత వహించలేదు. అయితే, గతంలోనూ అల్-ఖైదా అనుబంధ సంస్థ జేఎన్ఐఎం విదేశీయులను కిడ్నాప్ చేసి, 50 మిలియన్ డాలర్ల భారీ విమోచన క్రయం చెల్లించిన తర్వాత విడుదల చేసింది. ఈ నేపథ్యంలో తాజా కిడ్నాప్ కూడా డబ్బు కోసమే జరిగి ఉండవచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com