తెలంగాణాలో వణికిస్తున్న చలి..

- November 08, 2025 , by Maagulf
తెలంగాణాలో వణికిస్తున్న చలి..

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో వర్షాల ప్రభావం తగ్గి, చలి తీవ్రత పెరుగుతోంది. రానున్న రోజుల్లో రాత్రిపూట ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోనున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. రేపటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా చలి ప్రభావం మరింతగా ఉండబోతోందని తెలిపింది. కనిష్ఠ ఉష్ణోగ్రతలు 9 నుంచి 14 డిగ్రీల మధ్య నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని, రాష్ట్రంలోని 23 జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ జారీ చేశారు. ఈ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 12 నుండి 14 డిగ్రీల మధ్య ఉండవచ్చని సూచించారు. ప్రజలు రాత్రి వేళలు జాగ్రత్తగా ఉండాలని, అవసరమైతే బయటకు వెళ్లడం నివారించాలని సూచించారు.

ముఖ్యంగా ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్ జిల్లాల్లో చలి తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని హెచ్చరించారు. ఈ జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్‌ అలర్ట్‌ ప్రకటించింది. కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల కంటే తక్కువకు పడిపోవచ్చని అంచనా వేసింది.

ఇప్పటికే రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. శనివారం ఆదిలాబాద్ జిల్లా బేలలో 14.8 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. రేపటి నుంచి రాష్ట్రంలో చలి ప్రభావం మరింతగా పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com