గోవా నైట్ క్లబ్‌లో భారీ అగ్ని ప్రమాదం, 25 మంది మృతి

- December 07, 2025 , by Maagulf
గోవా నైట్ క్లబ్‌లో భారీ అగ్ని ప్రమాదం, 25 మంది మృతి

గోవా: గోవాలో విషాదకర సంఘటన చోటు చేసుకుంది. అర్ధరాత్రి దాటిన తర్వాత ఓ నైట్‌క్లబ్‌లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.ఈ దుర్ఘటనలో 25 మంది ప్రాణాలు కోల్పోయారు. సజీవ దహనం అయ్యారు. ఈ ఘటన పట్ల ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. సమగ్ర దర్యాప్తునకు ఆదేశించారు. సమాచారం అందిన వెంటనే ఆయన సంఘటన స్థలానికి చేరుకున్నారు. సిలిండర్ పేలుడు కారణంగా ఈ ప్రమాదం సంభవించినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు.

నార్త్ గోవా జిల్లాలోని అర్పోరాలో ఈ దుర్ఘటన సంభవించింది. రాజధాని పనాజీకి సుమారు 25 కిలో మీటర్ల దూరంలో ఉంటుందీ అర్పోరా.ఇక్కడికి పర్యాటకుల తాకిడి అధికం. చలికాలాన్ని ఆస్వాదించడానికి డిసెంబర్ లో పెద్ద సంఖ్యలో పర్యాటకులు ఇక్కడికి చేరుకుంటోన్నారు. ఈ పరిస్థతుల్లో ఇక్కడి 'బిర్చ్ బై రోమియో లేన్' అనే నైట్ క్లబ్ లో వీకెండ్ పార్టీని నిర్వహించారు. పార్టీ జోరుగా సాగుతున్నప్పుడు అగ్నిప్రమాదం సంభవించింది. మంటలు ఎగిసిపడ్డాయి.

తొలుత వంటగదిలో మంటలు చెలరేగాయి. మంటలు చెలరేగడానికి ముందు పేలుడు శబ్దం వినిపించినట్లు ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. దీంతో ఒక్కసారిగా మంటలు నైట్‌క్లబ్‌ను చుట్టుముట్టాయి. క్షణాల్లో అగ్నికీలలు వ్యాపించాయి. బయటపడటానికి దారి లేకుండా పోయింది. ఈ మంటల బారిన పడి వీకెండ్ పార్టీలో ఉన్న వారిలో 23 మంది సజీవదహనం అయ్యారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. అర్పోరా మొత్తం హాహాకారాలతో నిండిపోయింది.

దీన్ని గమనించిన స్థానికులు పోలీసులు, అగ్నిమాపక దళానికి సమాచారం అందించారు. సమాచారం అందిన వెంటనే గోవా పోలీస్ డైరెక్టర్ జనరల్ అలోక్ కుమార్ సహా ఉన్నతాధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు. రాత్రి 12:04 నిమిషాలకు పోలీసు కంట్రోల్ రూమ్‌కు అగ్నిప్రమాదం సమాచారం అందిందని అలోక్ కుమార్ తెలిపారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు, అగ్నిమాపక దళం, హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com