ఎన్నికల తేదీల కోసం జనాల ఎదురు చూపులు: కేటీఆర్

- December 10, 2025 , by Maagulf
ఎన్నికల తేదీల కోసం జనాల ఎదురు చూపులు: కేటీఆర్

హైదరాబాద్: బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు మాజీ మంత్రి కేటీఆర్ బుధవారం సిరిసిల్లలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రజలు మళ్లీ బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌ను ముఖ్యమంత్రి చేయాలని కోరుకుంటున్నారని, అందుకోసం అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడు వస్తాయా అని ఎదురుచూస్తున్నారని కేటీఆర్ తెలిపారు.

సిరిసిల్ల పర్యటనలో భాగంగా ఆటో డ్రైవర్లకు ఏర్పాటు చేసిన ఆత్మీయ భరోసా కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి దేవుళ్ల మీద ఒట్టేసి మరీ ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. రూ. 2 లక్షల రుణ మాఫీ చేయాలంటే సుమారు రూ. 50 వేల కోట్లు అవసరమవుతాయని, కానీ కేవలం రూ. 12 వేల కోట్లతో 25 శాతం మందికి మాత్రమే రుణ మాఫీ చేశారని కేటీఆర్ గుర్తుచేశారు.

ఎన్నికల సమయంలో ఇచ్చిన రెండు లక్షల ఉద్యోగాలు ఏమైనాయి సీఎం రేవంత్ రెడ్డి అంటూ కేటీఆర్ సూటిగా ప్రశ్నించారు. తాము ఇచ్చిన ఉద్యోగాలను నువ్వు ఇచ్చినట్లు చెప్పుకుంటావా అని సీఎం రేవంత్ రెడ్డిపై (Revanth Reddy) ఈ సందర్భంగా కేటీఆర్ నిలదీశారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లు అయినా ఇంకా అబద్ధాలే చెబుతావా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 420 హామీలు ఇచ్చి, అందులో ఒక్కటీ అమలు చేయలేదని సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ నిప్పులు చెరిగారు. ఈ పర్యటనలో ఆటో డ్రైవర్లకు ఇన్సూరెన్స్ బాండ్లను కేటీఆర్ పంపిణీ చేశారు.

2023 ఏడాది చివరల్లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు. దీంతో రేవంత్ రెడ్డి సారథ్యంలో ప్రభుత్వం ఏర్పడింది. పదేళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్ పార్టీ ఈ ఎన్నికల ఫలితాలతో ప్రతిపక్షానికి పరిమితమైంది. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు పలు హామీలు ఇచ్చింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు అయినా ఆ హామీలను ఇంకా అమలు చేయడం లేదని ప్రతిపక్ష బీఆర్‌ఎస్ పార్టీ వరుసగా విమర్శలు గుప్పిస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com