అమరావతి భూముల లావాదేవీలపై ఐటీ డేగ కన్ను

- July 28, 2016 , by Maagulf
అమరావతి భూముల లావాదేవీలపై ఐటీ డేగ కన్ను

ఏపీ రాజధాని అమరావతిలో ఏర్పాటు కాబోతుందన్న వార్తల నేపథ్యంలో భూముల ధరలు ఆకాశాన్ని తాకాయి. ఎడాపెడా జరిగిపోయిన భూముల లావాదేవీల్లో కొనుగోళ్లు- అమ్మకాలు ఊపందుకున్నాయి. కోట్ల రూపాయల ఖరీదు చేసే భూములకు ప్రభుత్వ రిజిస్ర్టేషన్ ఛార్జీలు మాత్రం నామమాత్రమే! పెద్దపెద్ద లావాదేవీలు చేసి తమ భూముల్ని అమ్ముకున్న కొంతమంది రైతుల వద్ద భారీస్థాయిలో నల్లడబ్బు(బ్లాక్ మనీ) నిల్వలు వున్నాయన్నది ఐటీ శాఖ అభిప్రాయం. దీంతో ఇప్పుడు ఆ శాఖ అధికారులు అమరావతి భూముల లావాదేవీలపై డేగ కన్ను వేసినట్టు తెలుస్తోంది. కొంతమంది రైతుల నుంచి తక్కువ ధరకే భూములను కొనుక్కొని తిరిగి అమ్మేసి కోట్లాది రూపాయలు వెనుకేసుకున్న రియల్ ఎస్టేట్ వ్యాపారులపై ఈ శాఖ దృష్టి పెట్టింది. ఇప్పటికే అటువంటి వ్యక్తులకు సంబంధించిన కీలక సమాచారాన్ని ఐటీ సేకరించినట్టు రూఢీగా తెలుస్తోంది. అసలు కోటి రూపాయలకు పైగా విలువ చేసే ఎకరం భూమికి కేవలం 3 లక్షలకే ప్రభుత్వ రిజిస్ర్టేషన్ ధర నిర్ణయించడం పట్ల కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం బేసబబుగావుందంటూ కొంతమంది సీనియర్ అధికారులు అసంతృప్తి వ్యక్తంచేసినట్టు సమాచారం. ఒకరిద్దరు మంత్రులు తమ బినామీలతో విచ్చలవిడిగా కొనుగోలు చేసిన భూములకు సంబంధించిన లావాదేవీలపై కూడా ఈ శాఖ దృష్టి పెట్టిందని అంటున్నారు. ఇప్పటికే ఇద్దరువ్యక్తుల్ని పిలిపించి సదరు లావాదేవీలకు సంబంధించిన వ్యవహారాలపై ఆరా తీసినట్టు వార్తలొచ్చాయి.
ఇటీవల కేంద్రప్రభుత్వం ప్రకటించిన స్వచ్ఛంద ఆదాయపు వెల్లడి పథకం- ఐడీఎస్ కింద కొన్ని కార్పొరేట్ సంస్థల నుంచి వచ్చిన స్పందనే తప్ప వ్యక్తుల నుంచి రాలేదు. ఇటువంటి భారీస్థాయి భూముల లావాదేవీల్లో ఐటీశాఖ కళ్లుకప్పి కోట్లాది రూపాయలు వెనకేసుకున్న వ్యక్తులు ముందుకొచ్చి ఈ పథకం ద్వారా ఎంతోకొంత లబ్ధిపొందుతారని ఆర్థికశాఖ అంచనా వేసింది. ఐతే, తుదిగడుపు సమీపిస్తున్నా అటువంటి దాఖలాలేవీ కనపడకపోవడంతో గడుపు పూర్తికాగానే తమ దగ్గరున్న సమాచారం ఆధారంతో భారీస్థాయిలో సోదాలు నిర్వహిస్తారని చెబుతున్నారు. ఇదేగనుక నిజమైతే చాలామంది పెద్దలకు కత్తెర పడబోతుందన్నమాట!

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com