ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్..

- April 21, 2026 , by Maagulf
ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్..

అమరావతి: ఎండలు మండిపోతున్నాయి. సూర్యుడు నిప్పులు కక్కుతున్నాడు. రికార్డ్ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎండ తీవ్రతతో ఏపీలో జనం విలవిలలాడిపోతున్నారు. ఇలాంటి సమయంలో ఏపీ విపత్తుల నిర్వహణ శాఖ ప్రజలకు కీలక హెచ్చరికలు జారీలు చేసింది.

బుధవారం రోజు (ఏప్రిల్22) రాష్ట్ర వ్యాప్తంగా 76 మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది. మరో 134 మండలాల్లో వడగాలులు ప్రభావం ఉంటుందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో ప్రజలు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

మంగళవారం తిరుపతి జిల్లా వరదయ్య పాలెంలో అత్యధికంగా 44.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 288 మండలాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అయితే, బుధవారం కూడా పలు ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఎండ తీవ్రత, వడగాల్పుల నేపథ్యంలో బయటకు వెళ్లే సమయాల్లో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.

బుధవారం శ్రీకాకుళం జిల్లాలో 19 మండలాల్లో, విజయనగరం జిల్లాలోని 21 మండలాల్లో, అనకాపల్లి జిల్లాలో 15, పార్వతీపురం మన్యంలో మూడు, అల్లూరి సీతారామరాజు జిల్లాలో నాలుగు మండలాల్లో, పోలవరం జిల్లాలో ఐదు, కాకినాడలో ఆరు, తూర్పుగోదావరి జిల్లాలోని రెండు మండలాల్లో, విశాఖపట్టణం జిల్లాలోని ఒక మండలంలో తీవ్ర వడగాలులు ప్రభావం చూపే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.

ఒకపక్క ఏపీలో ఎండల తీవ్రత రోజురోజుకు పెరుగుతున్న క్రమంలోనే వర్షాలు సైతం కురుస్తున్నాయి. మంగళవారం సాయంత్రం అల్లూరి సీతారామరాజు జిల్లాలో భారీ వర్షం కురిసింది. పాడేరులో ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. అయితే, బుధవారం రోజు పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, సత్యసాయి జిల్లాల్లో కొన్నిచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com