ఏపీ: రాష్ట్రానికి రూ.567 కోట్లు నిధులు విడుదల చేసిన కేంద్రం

- January 14, 2026 , by Maagulf
ఏపీ: రాష్ట్రానికి రూ.567 కోట్లు నిధులు విడుదల చేసిన కేంద్రం

అమరావతి: సంక్రాంతి పండుగ సందర్భంగా, కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ (AP) రాష్ట్రానికి శుభవార్త అందించింది. రాష్ట్ర ఆరోగ్య రంగ అభివృద్ధికి కేంద్రం భారీగా రూ. 567.40 కోట్ల గ్రాంటును విడుదల చేసినట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. ఈ మేరకు ఆయన అధికారికంగా ఒక ప్రకటన జారీ చేసి, కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. పండుగ వేళ ఈ నిధులు విడుదల కావడం రాష్ట్రానికి ఎంతో మేలు చేస్తుందని ఆయన పేర్కొన్నారు. గత 19 నెలల కాలంలో 15వ ఆర్థిక సంఘం నిధుల్లో 48 శాతం మేర నిధులను వినియోగించడం జరిగిందని తెలిపారు.

ఏపీలోని కూటమి ప్రభుత్వంలో నిధుల వినియోగం పెరగడం పట్ల కేంద్ర ప్రభుత్వం సంతృప్తిని వ్యక్తం చేసిందని చెప్పారు. ఇది, ఏపీ ప్రభుత్వానికి కేంద్రం గుర్తింపును ఇచ్చినట్టేనని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ఆరోగ్య రంగం మరింత బలోపేతం కావడానికి ఈ నిధులు ఉపయోగపడతాయని మంత్రి చెప్పారు. రాష్ట్రానికి రావాల్సిన మిగుల నిధుల కోసం కేంద్ర ఆర్థిక శాఖతో వెంటనే చర్చలు ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు.

కేంద్రం నుంచి అన్ని రకాలుగా, పూర్తి స్థాయిలో ఆర్థిక సాయాన్ని సాధించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆసుపత్రుల బలోపేతం, ఆరోగ్య మౌలిక వసతుల అభివృద్ధి, ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందించడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అన్నారు. 15వ ఆర్థిక సంఘం నిధులను పూర్తిగా పొందిన మూడవ రాష్ట్రంగా ఏపీ అవతరించిందని చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com