ఉక్రెయిన్‌లో శాంతి చర్చల ముందు రష్యా డ్రోన్ దాడి..15 మంది మృతి

- February 02, 2026 , by Maagulf
ఉక్రెయిన్‌లో శాంతి చర్చల ముందు రష్యా డ్రోన్ దాడి..15 మంది మృతి

ఉక్రెయిన్‌లో శాంతి చర్చలు ప్రారంభమయ్యే ముందు గంటల వ్యవధిలోనే రష్యా ఘోరమైన డ్రోన్ దాడికి పాల్పడింది. ఉక్రెయిన్‌లోని డ్నిప్రో నగరంలో గని కార్మికులను తీసుకెళ్తున్న బస్సును రష్యన్ డ్రోన్ ఢీకొట్టడంతో 15 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర ఆవేదనకు దారి తీసింది. డ్నిప్రోపెట్రోవ్స్క్ ప్రాంత రాజధాని డ్నిప్రో సమీపంలో ఈ దాడి జరిగింది. గని కార్మికులతో వెళ్తున్న కంపెనీ బస్సును లక్ష్యంగా చేసుకుని డ్రోన్ దాడి జరగడంతో బస్సు పూర్తిగా ధ్వంసమైంది. ఈ ఘటనలో మరో ఏడుగురు తీవ్రంగా గాయపడినట్లు ఉక్రెయిన్ (Ukraine) అత్యవసర సేవలు వెల్లడించాయి. దాడి అనంతరం బస్సులో మంటలు చెలరేగినట్లు అధికారులు తెలిపారు.

ఉక్రెయిన్‌లోని అతిపెద్ద ప్రైవేట్ ఇంధన సంస్థ DTEK, దాడికి గురైన బస్సు తమ సంస్థకు చెందినదేనని స్పష్టం చేసింది. డ్నిప్రోపెట్రోవ్స్క్ ప్రాంతంలోని తమ గనులపై రష్యా ఉద్దేశపూర్వకంగా ఉగ్రవాద దాడి చేసిందని ఆరోపించింది. గనుల నుంచి కార్మికులను తరలిస్తున్న సమయంలోనే ఈ దాడి జరగడం గమనార్హమని పేర్కొంది. రష్యా మరియు ఉక్రెయిన్ ప్రతినిధుల మధ్య తదుపరి దశ శాంతి చర్చలు బుధవారం, గురువారం జరుగుతాయని అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ ప్రకటించిన కొన్ని గంటలకే ఈ దాడి జరిగింది. దీంతో శాంతి చర్చలపై అనుమానాలు మరింత పెరిగాయి.

ఉక్రెయిన్ ఇంధన మంత్రి డెనిస్ ష్మిహాల్ ఈ దాడిని తీవ్రంగా ఖండించారు. ఇది సాధారణ దాడి కాదని, ఇంధన రంగంలో పనిచేస్తున్న కార్మికులను లక్ష్యంగా చేసుకుని చేసిన దాడిగా ఆయన పేర్కొన్నారు. ఈ ఘటన టెర్నివ్స్కా గని సమీపంలో చోటుచేసుకుందని తెలిపారు. డ్నిప్రో దాడికి కొన్ని గంటల ముందు, దక్షిణ ఉక్రెయిన్‌లోని జాపోరిజ్జియా నగరంలో రష్యన్ డ్రోన్‌లు ప్రసూతి ఆసుపత్రిని లక్ష్యంగా చేసుకున్నాయి. ఈ దాడిలో ఆరుగురు గాయపడినట్లు అత్యవసర సేవలు వెల్లడించాయి. ఆసుపత్రులపైనా దాడులు కొనసాగడం మానవ హక్కుల ఉల్లంఘనగా ఉక్రెయిన్ ఆరోపిస్తోంది. గడ్డకట్టే చలిలో ఉక్రెయిన్ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో, రాజధాని సహా ప్రధాన నగరాలపై దాడులను తాత్కాలికంగా నిలిపివేయడానికి క్రెమ్లిన్ అంగీకరించిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల ప్రకటించారు. కానీ తాజా దాడులు ఆ ప్రకటనకు విరుద్ధంగా జరిగాయి.

రష్యా, ఉక్రెయిన్ మరియు అమెరికా ప్రతినిధులు అబుదాబిలో సమావేశం కావాల్సి ఉన్నప్పటికీ, ఆదివారం శాంతి చర్చలు జరగలేదు. జెలెన్స్కీ ప్రకటన ప్రకారం, ఈ చర్చలు వచ్చే వారం జరగనున్నాయి. తాజా దాడుల నేపథ్యంలో చర్చలు ఎంతవరకు ఫలిస్తాయన్న దానిపై అంతర్జాతీయంగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com