మచిలీపట్నం పోర్ట్ అభివృద్ధికి కీలక నిర్ణయాలు: ఎంపీ బాలశౌరి

- February 09, 2026 , by Maagulf
మచిలీపట్నం పోర్ట్ అభివృద్ధికి కీలక నిర్ణయాలు: ఎంపీ బాలశౌరి

మచిలీపట్నం: మచిలీపట్నంలో షిప్ బిల్డింగ్ మరియు షిప్ రిపేర్ సౌకర్యాల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు మంజూరు చేయడం హర్షణీయమని మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి తెలిపారు. ఈ నిర్ణయం ద్వారా మచిలీపట్నం పోర్ట్‌కు మరిన్ని అవకాశాలు లభించి, ప్రాంతీయ అభివృద్ధికి కొత్త దిశలు తెరుచుకుంటాయని ఆయన పేర్కొన్నారు.

ఆంధ్రప్రదేశ్ మారిటైమ్ బోర్డుకు అవసరమైన అధికారాలు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల పోర్ట్ అభివృద్ధి వేగవంతం కానుందని ఎంపీ బాలశౌరి అన్నారు. ఈ చర్యలతో మచిలీపట్నం పోర్ట్ రూపురేఖలు మారి, జాతీయ మరియు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందే అవకాశాలు ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.

షిప్ బిల్డింగ్ మరియు షిప్ రిపేర్ సౌకర్యాల ఏర్పాటుకు జాతీయ, అంతర్జాతీయ సంస్థలతో సంప్రదింపులు జరుపుతున్నామని, దీని ద్వారా ప్రాంతంలో ఉపాధి అవకాశాలు పెరిగి, ఆర్థికాభివృద్ధి సాధ్యమవుతుందని ఎంపీ బాలశౌరి పేర్కొన్నారు. బందరు ప్రజల దీర్ఘకాలిక కల నెరవేరే దిశగా ఈ నిర్ణయాలు కీలకంగా నిలుస్తాయని ఆయన అన్నారు.

ఈ అంశానికి సంబంధించిన జివోను జారీ చేసి అనుమతులు మంజూరు చేసిన రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి మరియు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కి ఎంపీ బాలశౌరి కృతజ్ఞతలు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com