టీబీజేపీ ప్రెసిడెంట్ రాంచందర్ రావు అరెస్ట్..

- February 22, 2026 , by Maagulf
టీబీజేపీ ప్రెసిడెంట్ రాంచందర్ రావు అరెస్ట్..

హైదరాబాద్: తెలంగాణలో రాజకీయం ఒక్కసారిగా హీటెక్కింది. బీజేపీ, కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి క్యాంప్ కార్యాలయంపై కాంగ్రెస్ కార్యకర్తలు చేసిన దాడి, ఆ తరువాత జరిగిన పరిణామాలను బీజేపీ రాష్ట్ర అధిష్టానం సీరియస్‌గా తీసుకుంది. ఈ క్రమంలో కామారెడ్డి వెళ్లేందుకు బీజేపీ అగ్రనేతలు సిద్ధమయ్యారు. అయితే, పోలీసులు వారిని అడ్డుకొని అరెస్టులు, హౌస్ అరెస్టులు చేస్తున్నారు.  హైదరాబాద్ తార్నాకలోని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రాంచందర్ రావు నివాసం వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.

బీజేపీ చీఫ్ రాంచందర్ రావు కామారెడ్డి వెళ్లేందుకు ప్రయత్నించారు. ఆయనతోపాటు బీజేపీ శ్రేణులు కామారెడ్డికి బయలుదేరుతున్న క్రమంలో పోలీసులు వారిని అడ్డుకున్నారు. రాంచందర్ రావును తార్నాకలోని ఆయన నివాసం వద్ద హౌస్ అరెస్టు చేశారు. దీంతో ఆయన నివాసం వద్ద తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. బీజేపీ శ్రేణులు, పోలీసుల మధ్య తీవ్ర వాగ్వవాదం, తోపులాట చోటు చేసుకుంది. పోలీసులను తోసుకొని రాంచందర్ రావుసహా బీజేపీ శ్రేణులు కామారెడ్డి వెళ్లేందుకు ప్రయత్నించగా.. పోలీసులు రాంచదర్ రావుతోపాటు పలువురిని అరెస్టు చేసి స్థానిక పోలీస్ స్టేషన్ కు తరలించారు.

మరోవైపు.. నిర్మల్ వెళ్తున్న గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌ను మెదక్ పోలీసులు అరెస్టు చేశారు. ఈరోజు నేను ఛత్రపతి శివాజీ మహారాజ్ కొత్త విగ్రహాన్ని ఆవిష్కరించడానికి తెలంగాణలోని నిర్మల్ జిల్లాలోని ఓలా గ్రామానికి వెళ్లాల్సి ఉంది.. కానీ, దురదృష్టవశాత్తు తెలంగాణలో హిందూ వ్యతిరేక, ఛత్రపతి శివాజీ మహారాజ్ వ్యతిరేక ప్రభుత్వం ఉంది. వారు నన్ను ఆ కార్యక్రమానికి వెళ్లకుండా ఆపేశారు.. నన్ను మెదక్ జిల్లాలోని శంకరంపేట పోలీస్ స్టేషన్ లో ఉంచారంటూ రాజాసింగ్ అన్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం తీరుపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ నివాసం వద్ద పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈటెలను హౌస్ అరెస్టు చేశారు. ఈటెల తన ఇంటి నుంచి బయటకు వచ్చే ప్రయత్నం చేయగా.. బయటకు వెళ్లేందుకు అనుమతి లేదని పోలీసులు ఆయన్ను అడ్డుకున్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారకుండా జాగ్రత్త చర్యలు తీసుకున్నామని పోలీసులు తెలిపారు.

బీజేఎల్పీ నేత, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డిని రెండోరోజు పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. హైదరాబాద్ బంజారాహిల్స్ లోని తన నివాసంలో ఆయన్ను గృహనిర్భందం చేశారు. ఈ సందర్భంగా ఆయన పోలీసుల తీరుపైనా, ప్రభుత్వం తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను గృహనిర్బంధం చేయడం రేవంత్ రెడ్డి ప్రభుత్వ భయాన్ని బహిర్గతం చేస్తోందని అన్నారు. అరెస్టులతో, నిర్భంధాలతో అడ్డుకోలేరు.. ప్రశ్నించే గొంతుకను చూసి ఎందుకు భయమని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మహేశ్వర్రెడ్డి ప్రశ్నించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com