ట్రంప్ టారిఫ్ దెబ్బ, దిగుమతుల పై 15% సుంకం ప్రకటింపు

- February 22, 2026 , by Maagulf
ట్రంప్ టారిఫ్ దెబ్బ, దిగుమతుల పై 15% సుంకం ప్రకటింపు

అమెరికా: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన నిర్ణయం తీసుకున్నారు. విదేశాల నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై సుంకాలను 15 శాతానికి పెంచుతున్నట్లు ప్రకటించారు. ముందుగా 10 శాతం సుంకాలు విధిస్తానని ప్రకటించిన ట్రంప్, తాజాగా మరింత పెంపును ప్రకటించడం గ్లోబల్ వాణిజ్య వర్గాల్లో చర్చనీయాంశమైంది.

ఇటీవల అధ్యక్షుడికి స్వతంత్రంగా సుంకాలు విధించే అధికారం లేదని, ఆ అధికారం కాంగ్రెస్‌కే ఉందని అమెరికా సుప్రీంకోర్టు 6-3 మెజారిటీతో తీర్పు ఇచ్చింది. ఈ తీర్పుపై ట్రంప్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ, దేశ ప్రయోజనాలను దెబ్బతీసే నిర్ణయమని విమర్శించారు. కోర్టు అడ్డంకులు ఉన్నప్పటికీ, ఇతర చట్టపరమైన మార్గాల ద్వారా సుంకాలను అమలు చేయాలని చూస్తున్నట్లు ఆయన సంకేతాలు ఇచ్చారు.

తీర్పు ఇచ్చిన న్యాయమూర్తులపై ట్రంప్ విమర్శలు చేయగా, తనకు మద్దతుగా నిలిచిన జడ్జి బ్రెట్ కావనాకు ప్రశంసలు కురిపించారు. దిగుమతి సుంకాల పెంపుతో దేశీయ తయారీ రంగం బలోపేతం అవుతుందని, అమెరికా ఆర్థిక వ్యవస్థకు మేలు జరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.

అయితే ఈ నిర్ణయంపై డెమోక్రాట్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. అధిక సుంకాలు విధించడం వల్ల వస్తువుల ధరలు పెరిగి సాధారణ ప్రజలపై భారం పడుతుందని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే దిగుమతి సుంకాల ద్వారా భారీ ఆదాయం సమకూరగా, తాజా పెంపు ఎంతకాలం కొనసాగుతుందన్నది ఆసక్తికరంగా మారింది.

ప్రపంచ దేశాలన్నింటికీ 15 శాతం సుంకం వర్తించే అవకాశంతో భారత్ సహా అనేక దేశాలపై ప్రభావం పడనుంది. అంతర్జాతీయ వాణిజ్య సంబంధాలపై ఈ నిర్ణయం ప్రభావం చూపే అవకాశముందని నిపుణులు భావిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com