ఇరాన్ పాఠశాలపై జరిగిన దాడిని ఖండించిన ట్రంప్

- March 08, 2026 , by Maagulf
ఇరాన్ పాఠశాలపై జరిగిన దాడిని ఖండించిన ట్రంప్

అమెరికా: ఇరాన్‌లోని మీనాబ్ ప్రాంతంలో ఉన్న ‘షజరే తయెబా’ (Shajareh Tayyebeh) బాలికల ప్రాథమిక పాఠశాలలో, 160 మంది మరణించిన ఘటనపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఘాటుగా స్పందించారు. మయామి పర్యటనకు వెళ్తున్న సమయంలో ఎయిర్ ఫోర్స్ వన్ విమానంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ దాడికి, అమెరికా దళాలకు ఎటువంటి సంబంధం లేదని ఆయన తేల్చి చెప్పారు. పాఠశాల దాడి గురించి విలేకరులు ప్రశ్నించగా ట్రంప్ ఆ ఆరోపణలను ఖండించారు.

“నేను చూసిన సమాచారం, ఆధారాల ప్రకారం అది కచ్చితంగా ఇరాన్ చేసిన పనే. వారి ఆయుధాలు, మందుగుండు సామాగ్రి చాలా అస్థిరంగా ఉంటాయి. వాటికి లక్ష్యాన్ని ఛేదించే కచ్చితత్వం అస్సలు ఉండదు. గురి తప్పి వారి పాఠశాల మీదే పడి ఉండవచ్చు తప్ప, మేము స్కూల్ పిల్లలపై దాడులు చేయం. ఇది పూర్తిగా వారి తప్పిదమే,” అని ట్రంప్ స్పష్టం చేశారు.యుద్ధం పురోగతిపై ట్రంప్ పూర్తి ఆత్మవిశ్వాసాన్ని వ్యక్తం చేశారు. తాము యుద్ధంలో గొప్ప విజయాలు సాధిస్తున్నామని, ఇరాన్ అనే “దుష్ట సామ్రాజ్యాన్ని” దాదాపు నేలమట్టం చేశామని వ్యాఖ్యానించారు.

“వారి నౌకాదళంలోని 44 ఓడలను, వైమానిక దళంలోని ప్రతి విమానాన్ని మేము ధ్వంసం చేశాం. వారి క్షిపణి తయారీ కేంద్రాలపై, డ్రోన్ల నిల్వలపై తీవ్ర దాడులు జరిపాం. ఫలితంగా ఇప్పుడు ఇరాన్ నుంచి వచ్చే దాడులు నామమాత్రంగా మారాయి. యుద్ధం మొదలైన మొదటి రెండు రోజులతో పోలిస్తే, ప్రస్తుతం వారు కేవలం 9 శాతం సామర్థ్యంతోనే పోరాడుతున్నారు. వారి దగ్గరున్న 70 శాతం లాంచర్లు నాశనమయ్యాయి.

అవి చాలా ఖరీదైనవి, తిరిగి సమకూర్చుకోవడం వారికి చాలా కష్టం. వారి నాయకత్వం అంతా దాదాపు అంతమైంది,” అని అమెరికా విజయాలను ట్రంప్ వివరించారు.యుద్ధం ఎప్పుడు ముగుస్తుందన్న ప్రశ్నకు ట్రంప్ బదులిస్తూ, తాను కాలపరిమితిని అంచనా వేయనని, ఎంత సమయం పడితే అంత కాలం పోరాడుతామని చెప్పారు. ఇరాన్ సైన్యం దాదాపు తుడిచిపెట్టుకుపోయిందని, వారిపై మరింత తీవ్రంగా విరుచుకుపడాలా వద్దా అనేది ఇంకా నిర్ణయించలేదని అన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com