జాతీయ భద్రతపైనే ఫోకస్..అమెరికా-ఇరాన్ చర్చల్లో నో రోల్..!!

- March 25, 2026 , by Maagulf
జాతీయ భద్రతపైనే ఫోకస్..అమెరికా-ఇరాన్ చర్చల్లో నో రోల్..!!

దోహా: అమెరికా, ఇరాన్‌ల మధ్య చర్చల్లో ఖతార్ పాలుపంచుకోవడం లేదని, తమ దేశాన్ని రక్షించుకోవడంపైనే దృష్టి సారిస్తున్నామని ప్రధానమంత్రి సలహాదారు, విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి డాక్టర్ మజీద్ బిన్ మహమ్మద్ అల్ అన్సారీ స్పష్టం చేశారు.  “ఈ యుద్ధాన్ని దౌత్య మార్గాల ద్వారానే ముగించాలన్నది ఖతార్ వైఖరి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని సంఘర్షణలకు ఇది వర్తిస్తుంది. తిమంగా, అవి చర్చల టేబుల్ వద్దే పరిష్కారమవుతాయి.” అని పేర్కొన్నారు. చర్చలు ఎంత త్వరగా పూర్తయితే.. ప్రాణనష్టం, నష్టాలు అంత తక్కువగా ఉంటాయన్నారు.  ఈ విషయంలో అధికారిక లేదా అనధికారిక మార్గాల ద్వారా జరిగే అన్ని దౌత్య ప్రయత్నాలకు, ఈ యుద్ధానికి దౌత్యపరంగా ముగింపు పలికే ఏ చొరవకైనా తాము మద్దతు ఇస్తామని స్పష్టం చేశారు.

ఈ యుద్ధం ఖతార్‌ సహా గల్ఫ్ దేశాలపై జరుగుతున్న దురాక్రమణలు ఆందోళన కలిగిస్తున్నాయని ఆయన అన్నారు. అదే సమయంలో ఫేక్ మరియు తప్పుదోవ పట్టించే వార్తలను వ్యాప్తి చేయడం ద్వారా ప్రయోజనం పొందే వర్గాలు కూడా ఉన్నాయని హెచ్చరించారు. ఇప్పటివరకు ఖతార్ ను లక్ష్యంగా చేసుకున్న చాలా దాడులను విజయవంతంగా తిప్పికొట్టినట్లు పేర్కొన్నారు. ఇది ఖతార్ భద్రత మరియు రక్షణ వ్యవస్థల సామర్థ్యాన్ని ప్రతిబింబిస్తుందన్నారు. 

అదే సమయంలో, కార్యాలయాల్లో అత్యవసర పరిస్థితులు ఎదురైనప్పుడు ఎలా వ్యవహరించాలనే దానిపై పౌరులు మరియు నివాసితులందరూ తమ భద్రతను నిర్ధారించుకోవడానికి అధికారులు స్పష్టమైన మార్గదర్శకాలను జారీ చేశారని తెలిపారు.  

ఇక సంక్షోభం ప్రారంభమైనప్పటి నుండి ప్రాంతీయ మరియు అంతర్జాతీయ భాగస్వాములతో చర్చలు కొనసాగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. అమెరికా భూ బలగాలను మోహరిస్తుందనడానికి ప్రస్తుతం ఎటువంటి తమ వద్ద ఎటువంటి సమాచారం లేదని ఆయన అన్నారు.  అలాగే, గల్ఫ్‌ లోని ప్రాంతీయ భద్రతా వ్యవస్థ సమర్థతపై ఈ యుద్ధం తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తిందని అల్ అన్సారీ పేర్కొన్నారు. సామూహిక ప్రాంతీయ భద్రతా వ్యవస్థల సమగ్ర పునఃసమీక్ష అవసరాన్ని తెలియజేస్తోందన్నారు.

కాగా, ప్రస్తుత ఉద్రిక్తతకు ముగింపు పలకడానికి అమెరికా ప్రభుత్వంతో మరియు అధ్యక్షుడు ట్రంప్‌తో ఖతార్ చాలా సన్నిహితంగా పనిచేస్తోందని ఆయన అన్నారు. ఖతార్‌పై జరిగిన దాడుల వల్ల ఇంధన రంగం మరియు ఖతార్ ఆర్థిక వ్యవస్థలు ప్రభావితం అయ్యాయని పేర్కొన్నారు. రాస్ లాఫాన్ (Ras Laffan) పై జరిగిన దాడి ఫలితంగా ఇంధనాన్ని ఎగుమతి చేసే మా సామర్థ్యంలో 17 శాతం తగ్గుదల ఏర్పడిందని, దాంతో  వార్షిక ఆదాయంలో 20 బిలియన్ డాలర్లకు పైగా నష్టం వాటిల్లుతుందని పేర్కొన్నారు.  అలాగే జరిగిన నష్టాన్ని పూర్తిగా సరిదిద్దడానికి సుమారు నాలుగు లేదా ఐదు సంవత్సరాల సమయం పడుతుందని వెల్లడించారు. ఈ ప్రభావం ప్రపంచవ్యాప్తంగా తమ భాగస్వామ్య దేశాలపై కచ్చితంగా ఉంటుందన్నారు.      

>యుద్ధానంతర పరిస్థితుల్లో ఇరాన్‌తో ఖతార్ సంబంధాల గురించి వివరిస్తూ.. “ఇరాన్ వేల సంవత్సరాలుగా ఇక్కడే ఉంది. ఈ ప్రాంత ప్రజలు కూడా వేల సంవత్సరాలుగా ఇక్కడే నివసిస్తున్నారు. ఎవరూ ఎక్కడికీ వెళ్ళిపోవడం లేదు. పూర్తిగా తుడిచిపెట్టుకుపోవడం అనేది సాధ్యం కాదు. ఏ వ్యక్తి లేదా ఏ దేశం కూడా వేరేవారి కోరిక లేదా సంకల్పం వల్ల ఉనికిలోంచి కనుమరుగైపోదు. మనం ఒకరి పక్కన ఒకరం కలిసి జీవిస్తాము. మానవాళి భవిష్యత్తు కోసం మనం పొరుగు దేశాలుగా కొనసాగుతాము.  కాబట్టి మనం కలిసి జీవించే మార్గాలను కనుగొనక తప్పదు.”  అని పేర్కొన్నారు.

ఖతార్ గడ్డపై నివసిస్తున్న ప్రతి ఒక్కరి భద్రత, క్షేమం కోసం ముందు వరుసలో నిలబడతామని డాక్టర్ మజీద్ బిన్ మహమ్మద్ అల్ అన్సారీ స్పష్టం చేశారు.    

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com