బాలకృష్ణకు అరుదైన గౌరవం- లైఫ్‌ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు ప్రదానం

- March 26, 2026 , by Maagulf
బాలకృష్ణకు అరుదైన గౌరవం- లైఫ్‌ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు ప్రదానం

న్యూ ఢిల్లీ: నందమూరి బాలకృష్ణకు అరుదైన గౌరవం దక్కింది. దశాబ్దాలుగా సినిమా రంగానికి చేసిన కృషికిగానూ ఆయనకు ప్రతిష్టాత్మక 'లైఫ్‌ టైమ్ అచీవ్‌మెంట్' (జీవితకాల సాఫల్య) అవార్డు దక్కింది.ఢిల్లీలోని భారత్ మండపం వేదికగా బుధవారం జరిగిన దిల్లీ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ 2026 (IFFD) వేడుకల్లో ఆయనకు ఈ పురస్కారాన్ని అందజేశారు. దిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా చేతులమీదుగా బాలయ్య అవార్డు అందుకున్నారు.

బాలయ్యతోపాటుగా సీనియర్ నటి షర్మిలా ఠాగూర్, దివంగత నటుడు ధర్మేంద్రకు కూడా లైఫ్​ టైమ్ అచీవ్‌మెంట్‌ అవార్డు దక్కింది.అయితే ధర్మేంద్ర తరఫున కుటుంబసభ్యులను ఈ అవార్డుతో గౌరవించారు. వీళ్లకు సీఎం రేఖా గుప్తా అవార్డులు ప్రదానం చేశారు. ఇక ఢిల్లీ పర్యాటక, రవాణా అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ వేడుకలు ఈ నెల 31 దాకా కొనసాగనున్నాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేఖా గుప్తాతో పాటు మంత్రులు కపిల్ మిశ్రా, పర్వేశ్‌ సాహిబ్ సింగ్ వర్మ, నటీమణులు కంగనా రనౌత్, హేమమాలిని, షర్మిలా ఠాగూర్‌ హాజరైయ్యారు.

అవార్డు అందుకున్న అనంతరం బాలయ్య మాట్లాడారు. తన తల్లిదండ్రుల ఆశీర్వాదంతోనే 50ఏళ్లుగా సినీ ఇండస్ట్రీలో రాణించగలుగుతున్నానని అన్నారు. ఇక వయసు పెరిగేకొద్దీ నటనలో మరింత స్వేచ్ఛ లభిస్తుందని సీనియర్ నటి షర్మిలా ఠాగూర్ తెలిపారు. కాగా బాలయ్య బ్లాక్​బస్టర్ భగవంత్ కేసరి సినిమాను ఈ వేడుకలో ప్రదర్శించనున్నారు.

50 ఏళ్ల సినీ ప్రయాణంలో వందకు పైగా చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న బాలయ్యను 2025లో పలు ప్రతిష్ఠాత్మక అవార్డులు వరించాయి. సినీరంగంలో ఆయన సేవలకుగానూ కేంద్ర ప్రభుత్వం బాలయ్యను పద్మభూషణ్ అవార్డు ఇచ్చి గౌరవించింది.ఆంధ్రప్రదేశ్‌లో హిందూపురం నియోజకవర్గ ఎమ్మెల్యేగా రాజకీయ రంగంలో కూడా చురుకుగా కొనసాగుతున్నారు. ఇక గతేడాది నవంబర్​లో 56వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా​లోనూ బాలకృష్ణతోపాటు, సూపర్ స్టార్ రజనీకాంత్​కు అరుదైన గౌరవం దక్కింది. ఇద్దరు అగ్ర హీరోలను గోవా అంతర్జాతీయ సినీ ఉత్సవాల్లో సన్మానించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com