ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!

- July 22, 2026 , by Maagulf
ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!

మస్కట్: తీవ్రమైన వేసవి ఎండల నుంచి విద్యార్థులను రక్షించేందుకు ఒమన్‌లోని భారతీయ పాఠశాలలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమైన నేపథ్యంలో ఫిజికల్ ఎడ్యుకేషన్ (పీటీ) తరగతులు, క్రీడలు, మార్నింగ్ అసెంబ్లీ సహా అన్ని ఔట్ డోర్ కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఇండియన్ స్కూల్స్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ప్రకటించింది.

విద్యార్థుల భద్రత, ఆరోగ్యం, సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు బోర్డు వెల్లడించింది. ప్రస్తుతం పాఠశాలల్లో సుమారు 85 శాతం హాజరు నమోదవుతోందని తెలిపింది. వాతావరణ పరిస్థితులు అనుకూలించే వరకు ఔట్ డోర్ కార్యక్రమాలు నిర్వహించబోమని స్పష్టం చేసింది. విద్యార్థులు డీహైడ్రేషన్‌కు గురికాకుండా రోజంతా తరచూ నీరు తాగే బ్రేకులు కల్పించాలని, చల్లటి, పరిశుభ్రమైన తాగునీరు అందుబాటులో ఉంచాలని అన్ని పాఠశాలలకు ఆదేశాలు జారీ చేసింది.

అలాగే తరగతి గదులు, ప్రయోగశాలలు, సాధారణ ప్రదేశాలు, స్కూల్ బస్సుల్లోని ఎయిర్ కండిషనింగ్ వ్యవస్థలను తప్పనిసరిగా తనిఖీ చేసి, లోపాలు ఉంటే వెంటనే మరమ్మతులు చేయాలని సూచించింది. చిన్నారులు, ఇప్పటికే ఆరోగ్య సమస్యలు ఉన్న విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని బోర్డు పేర్కొంది. వేడి కారణంగా వచ్చే అనారోగ్య పరిస్థితులను ఎదుర్కొనేందుకు పాఠశాల క్లినిక్‌లను సిద్ధంగా ఉంచడంతో పాటు, హీట్ స్ట్రెస్ లక్షణాలను గుర్తించి వెంటనే స్పందించేలా ఉపాధ్యాయులు, సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇచ్చినట్లు బోర్డు చైర్మన్ సయ్యద్ అహ్మద్ సల్మాన్ తెలిపారు.  

అకాడమిక్ ప్రతిభతో పాటు విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని, అనుబంధ పాఠశాలల్లో ప్రతి విద్యార్థికి సురక్షితమైన, ఆరోగ్యకరమైన విద్యా వాతావరణాన్ని కల్పించేందుకు పాఠశాల యాజమాన్యాలతో కలిసి పనిచేస్తామని బోర్డు స్పష్టం చేసింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com