భారత్-ఇజ్రాయెల్ విమాన సర్వీసుల నిలిపివేత

- April 06, 2026 , by Maagulf
భారత్-ఇజ్రాయెల్ విమాన సర్వీసుల నిలిపివేత

ఇరాన్-ఇజ్రాయెల్ దేశాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్న నేపథ్యంలో భద్రతా కారణాల దృష్ట్యా ఎయిర్ ఇండియా కీలక ప్రకటన చేసింది.భారత్ నుండి ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్‌కు నడిచే తన విమాన సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు సంస్థ వెల్లడించింది. ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితుల్లో ప్రయాణికుల భద్రతకే తాము పెద్దపీట వేస్తున్నామని, అందుకే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ఎయిర్ ఇండియా స్పష్టం చేసింది.

తాజా ఉత్తర్వుల ప్రకారం, మే 31వ తేదీ వరకు ఇజ్రాయెల్‌కు ఎటువంటి ఎయిర్ ఇండియా సర్వీసులు అందుబాటులో ఉండవు. ఇప్పటికే ఆర్కియా, ఇస్రా ఎయిర్ వంటి అంతర్జాతీయ సంస్థలు తమ విమానాలను రద్దు చేయగా, ఇప్పుడు ఎయిర్ ఇండియా కూడా అదే బాటలో నడిచింది. ఈ నిర్ణయం వల్ల ఇజ్రాయెల్‌లో నివసిస్తున్న సుమారు 40,000 మంది భారతీయులకు స్వదేశానికి రావడానికి తీవ్ర అంతరాయం కలగనుంది. అత్యవసర ప్రయాణాలు చేయాలనుకునే వారు ఇప్పుడు జోర్డాన్ లేదా ఈజిప్ట్ వంటి పొరుగు దేశాల మీదుగా రోడ్డు మార్గంలో వెళ్లాల్సి రావడంతో అదనపు ఆర్థిక భారం పడనుంది.

ఇజ్రాయెల్‌లో నెలకొన్న పరిస్థితులను భారత రాయబార కార్యాలయం నిశితంగా గమనిస్తోంది. అక్కడ ఉన్న భారతీయులకు భరోసా కల్పించేందుకు రాయబారి జె.పి.సింగ్ ఆన్‌లైన్ సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఏదైనా అత్యవసర పరిస్థితి ఎదురైతే తక్షణమే సంప్రదించడానికి ప్రత్యేక హెల్ప్‌లైన్ నంబర్లను కూడా అందుబాటులోకి తెచ్చారు. ప్రయాణికులు తమ టికెట్ల రీఫండ్ లేదా రీషెడ్యూలింగ్ కోసం ఎయిర్ ఇండియా అధికారిక వెబ్‌సైట్ లేదా కస్టమర్ కేర్‌ను సంప్రదించాలని సూచించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com