సేఫ్ సిటీ ప్రాజెక్టు పై ఉన్నతస్థాయి సమీక్షించిన డీజీపీ సీవీ ఆనంద్

- July 17, 2026 , by Maagulf
సేఫ్ సిటీ ప్రాజెక్టు పై ఉన్నతస్థాయి సమీక్షించిన డీజీపీ సీవీ ఆనంద్

హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో భద్రతను మరింత బలోపేతం చేయడం లక్ష్యంగా అమలు చేస్తున్న సేఫ్ సిటీ ప్రాజెక్టు పురోగతిపై డీజీపీ సీవీ ఆనంద్ గురువారం డీజీపీ కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నగరంలోని నలుగురు పోలీసు కమిషనర్లు, ముగ్గురు మున్సిపల్ కమిషనర్లు, రవాణా కమిషనర్ పాల్గొన్నారు.

వేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్‌కు అనుగుణంగా నగర భద్రతను సాంకేతికత ఆధారంగా మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దాలని సమావేశంలో నిర్ణయించారు. మహిళలు, చిన్నారులు, వృద్ధులు, పాదచారులు సహా ప్రతి పౌరుడి భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ స్మార్ట్ పోలీసింగ్‌ను బలోపేతం చేయాలని డీజీపీ అధికారులకు సూచించారు.

సమావేశంలో హైడెఫినిషన్ (HD) సీసీటీవీ నిఘా వ్యవస్థను విస్తృతంగా వినియోగించడం, అన్ని కమిషనరేట్లలో ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లను మరింత సమర్థవంతంగా నిర్వహించడం, ఇంటెలిజెంట్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ సిస్టమ్, కృత్రిమ మేధస్సు (AI) ఆధారిత పర్యవేక్షణ ద్వారా నేరాల నివారణ, అత్యవసర పరిస్థితుల్లో వేగవంతమైన స్పందన వంటి అంశాలపై సమీక్షించారు.

నగరంలో ప్రస్తుతం 12 మొబైల్ షీ టాయిలెట్లు అందుబాటులో ఉండగా, మరో 12 మొబైల్ షీ టాయిలెట్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. మూడు మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలోని 12 జోన్లలో ఒక్కో జోన్‌కు రెండు చొప్పున అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోనున్నారు.

సేఫ్ సిటీ ప్రాజెక్టు మొదటి దశలో 2,306 సీసీటీవీ కెమెరాలు ఇప్పటికే పనిచేస్తుండగా, రెండో దశలో మరో 862 కెమెరాల ఏర్పాటు కొనసాగుతోందని అధికారులు తెలిపారు. అన్ని కెమెరాలు ఎప్పటికప్పుడు పనిచేసేలా నిర్వహించాలని డీజీపీ ఆదేశించారు.

పాదచారుల భద్రత కోసం నగరంలోని 77 ప్రాంతాల్లో పెలికన్ సిగ్నల్స్ (పాదచారుల ట్రాఫిక్ సిగ్నల్స్) అమల్లోకి తీసుకురానున్నట్లు వెల్లడించారు. ట్రాఫిక్ వాలంటీర్ల సహాయంతో పాదచారులు సురక్షితంగా రోడ్లు దాటేలా చర్యలు చేపట్టనున్నారు.

నగరంలోని 404 ట్రాఫిక్ సిగ్నల్స్ నిర్వహణ బాధ్యతను జీహెచ్‌ఎంసీ చేపట్టడంతో పాటు ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో పాదచారుల మౌలిక సదుపాయాలను మెరుగుపర్చాలని సమావేశంలో నిర్ణయించారు.

ప్రజల్లో అవగాహన పెంచేందుకు మొబైల్ ప్రచార వాహనాల ద్వారా రహదారి భద్రత, ట్రాఫిక్ నిబంధనలు, సైబర్ నేరాల నివారణ, మాదకద్రవ్యాల వ్యతిరేక ప్రచార కార్యక్రమాలను కొనసాగించాలని డీజీపీ అధికారులను ఆదేశించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com