ఇరాన్‌లో భారతీయులకు కేంద్రం అత్యవసర అలర్ట్..

- April 07, 2026 , by Maagulf
ఇరాన్‌లో భారతీయులకు కేంద్రం అత్యవసర అలర్ట్..

టెహ్రాన్: గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు మరింత తీవ్రరూపం దాల్చుతున్న నేపథ్యంలో, ఇరాన్‌లో నివసిస్తున్న భారతీయ పౌరులకు భారత ప్రభుత్వం అత్యవసర అలర్ట్ జారీ చేసింది. రాబోయే 48 గంటల పాటు ఎవరెక్కడ ఉన్నారో అక్కడే సురక్షితంగా ఉండాలని, అవసరం లేకుండా బయటకు రావద్దని స్పష్టంగా సూచించింది.

భారతీయులు తమ నివాసాల నుంచి బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు పాటించాలని, ముఖ్యంగా బహుళ అంతస్తుల భవనాల్లో నివసించే వారు పై అంతస్తుల్లో కాకుండా దిగువ అంతస్తుల్లో ఉండాలని సూచించింది. అలాగే విద్యుత్ కేంద్రాలు, మిలిటరీ స్థావరాలు మరియు ఇతర సున్నిత ప్రాంతాలకు దూరంగా ఉండాలని హెచ్చరించింది.

ఇరాన్‌లోని భారత రాయబార కార్యాలయ పరిధిలో ఉన్న హోటళ్లలో తాత్కాలికంగా ఉంటున్న భారతీయులు కూడా హోటల్ గదుల నుంచే బయటకు రావద్దని సూచనలు జారీ చేసింది. ఎప్పటికప్పుడు ఎంబసీ అధికారులతో, సహాయక బృందాలతో సంప్రదింపుల్లో ఉండాలని, అధికారిక సమాచారాన్నే నమ్మాలని తెలిపింది. ఈ మేరకు టెహ్రాన్‌లోని భారత రాయబార కార్యాలయం కీలక భద్రతా సూచనలు విడుదల చేసింది.

ఇదిలా ఉండగా, గల్ఫ్ ఉద్రిక్తతల పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన హెచ్చరికలను ఇరాన్ తీవ్రంగా ఖండించింది. “ఇరాన్ నాగరికతను అంతం చేస్తాం” అన్న ట్రంప్ వ్యాఖ్యలను తోసిపుచ్చుతూ, తమ దేశ చరిత్ర, సంస్కృతి కాలానికి ఎదురొడ్డి నిలిచిందని ఇరాన్ పేర్కొంది. ఇలాంటి హెచ్చరికలు తమపై ఎలాంటి ప్రభావం చూపవని స్పష్టం చేసింది.

తాజా పరిణామాల దృష్ట్యా ఇరాన్‌లోని భారతీయులు అప్రమత్తంగా ఉండాలని, రాయబార కార్యాలయం సూచనలను కచ్చితంగా పాటించాలని అధికారులు పునరుద్ఘాటించారు.

 

 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com