వీగిన బహ్రెయిన్ సముద్ర భద్రతా తీర్మానం..రష్యా,చైనా వీటో..!!
- April 08, 2026
మనామాః హోర్ముజ్ జలసంధిలో సముద్ర భద్రతను బలోపేతం చేయడం, నౌకాయాన స్వేచ్ఛను నిర్ధారించడం లక్ష్యంగా బహ్రెయిన్ రూపొందించిన ముసాయిదా తీర్మానాన్ని.. రష్యా, చైనాలు వీటో చేయడంతో ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో వీగిపోయింది. అంతకుముందు బహ్రెయిన్ ఏప్రిల్ 2026లో భద్రతా మండలి అధ్యక్షతన ఈ తీర్మానాన్ని లాంఛనంగా ప్రవేశపెట్టింది. గల్ఫ్ సహకార మండలి సభ్య దేశాలు, జోర్డాన్తో సన్నిహిత సమన్వయంతో ఈ ప్రతిపాదనను రూపొందించారు. అరేబియా గల్ఫ్, అరేబియా సముద్రం ద్వారా ప్రపంచ మార్కెట్లను అనుసంధానించే కీలకమైన ఇంధన, వాణిజ్య మార్గమైన హోర్ముజ్ జలసంధిలో నౌకాయానాన్ని పరిరక్షించడానికి పలు దేశాలు కలిసి "రక్షణాత్మక చర్యలు" తీసుకోవాలని ఈ ముసాయిదా పిలుపునిచ్చింది.
బహ్రెయిన్ విచారం
ఏప్రిల్ నెలలో ఐక్యరాజ్యసమితి భద్రతా మండలికి బహ్రెయిన్ అధ్యక్షత వహిస్తున్న విదేశాంగ మంత్రి డాక్టర్ అబ్దుల్లతీఫ్ బిన్ రషీద్ అల్ జయానీ.. ఓటింగ్ అనంతరం ఐక్యరాజ్యసమితిని ఉద్దేశించి ప్రసంగించారు. "ఈ రోజు ప్రవేశపెట్టిన తీర్మానం ఆమోదం పొందనందుకు, ఇతర గల్ఫ్ సహకార మండలి (GCC) దేశాలు మరియు జోర్డాన్తో పాటు బహ్రెయిన్ కూడా విచారం వ్యక్తం చేస్తోంది." అని ఆయన అన్నారు. అంతర్జాతీయ చట్టం ప్రకారం హోర్ముజ్ జలసంధిలో నౌకాయాన స్వేచ్ఛకు హామీ ఇచ్చే శాశ్వత పరిష్కారం దిశగా ఈ ముసాయిదా ఒక ముందడుగు అని ఆయన తెలిపారు. అంతర్జాతీయ చట్టపరమైన బాధ్యతలను పాటించాలని పిలుపునిచ్చారు. అలాగే, తీర్మానం 2817తో సహా గత భద్రతా మండలి తీర్మానాలను వెంటనే అమలు చేయాలని కోరారు.
ప్రపంచవ్యాప్తంగా ప్రభావం
హోర్ముజ్ జలసంధిలో ఏర్పడే అంతరాయాలు ఇంధన మార్కెట్ అస్థిరత, ప్రపంచ వాణిజ్య మార్గాలకు అంతరాయాలకు కారణం అవుతుందన్నారు. అదే సమయంలో ఆహార మరియు వైద్య సరఫరా గొలుసులపై ప్రభావం చూపడంతోపాటు అంతర్జాతీయ నౌకాయాన భద్రతకు పెరిగిన ప్రమాదాలతో సహా ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై సుదూర పరిణామాలను కలిగిస్తాయని గల్ఫ్ దేశాల నేతృత్వంలోని ఈ తీర్మానం తెలియజేసిందని పేర్కొన్నారు. కీలకమైన ప్రపంచ ఇంధన సరఫరాదారులుగా మరియు అంతర్జాతీయ మార్కెట్ల స్థిరీకరణ కారకాలుగా గల్ఫ్ దేశాల పాత్రను ఇది తెలియజేసిందన్నారు.
మండలి విశ్వసనీయత
అంతర్జాతీయ శాంతి మరియు భద్రతను కాపాడటంలో మండలి వైఫల్యం తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తుతుందని డాక్టర్ అల్ జయానీ హెచ్చరించారు. "ఈ రోజు మండలి విశ్వసనీయత ప్రమాదంలో ఉంది. ఇది మంచిది కాదు. పరిస్థితులు అవసరమైనప్పుడు నిర్ణయాత్మకంగా వ్యవహరించగల సామర్థ్యంపై అనుమానాలు పెరుగుతాయి." అని ఆయన పేర్కొన్నారు. ఈ తీర్మానాన్ని ఆమోదించకపోవడం క్షేత్రస్థాయి వాస్తవాలను మార్చదని, అలాగే అది ఇప్పటికే ఉన్న అంతర్జాతీయ చట్టపరమైన బాధ్యతలను గానీ, ఐక్యరాజ్యసమితి చార్టర్లోని ఆర్టికల్ 51 ప్రకారం తమ సార్వభౌమాధికారాన్ని కాపాడుకునే దేశాల హక్కును బలహీనపరచదని ఆయన తేల్చి చెప్పారు.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







