రూ.10 వేలు దాటితే గంట వెయిటింగ్..డిజిటల్ మోసాలకు ఆర్‌బీఐ ‘చెక్’!

- April 10, 2026 , by Maagulf
రూ.10 వేలు దాటితే గంట వెయిటింగ్..డిజిటల్ మోసాలకు ఆర్‌బీఐ ‘చెక్’!

ముంబై: దేశంలో రోజురోజుకూ పెరుగుతున్న డిజిటల్ మోసాలను అరికట్టేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అత్యంత కీలకమైన సంస్కరణలకు శ్రీకారం చుట్టింది.ముఖ్యంగా యూపీఐ, ఐఎంపీఎస్ వంటి తక్షణ చెల్లింపు విధానాల ద్వారా భారీ మొత్తంలో జరుగుతున్న ఆర్థిక నేరాలకు అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా కొత్త మార్గదర్శకాలను ప్రతిపాదిస్తోంది.2026 నాటికి ఆన్‌లైన్ మోసాల విలువ దాదాపు రూ. 22,000 కోట్లకు చేరుతుందన్న అంచనాల నేపథ్యంలో, ఆర్‌బీఐ ఈ నిర్ణయం తీసుకుంది.

ఈ కొత్త ప్రతిపాదన ప్రకారం రూ. 10,000 కంటే ఎక్కువ మొత్తాన్ని బదిలీ చేసినప్పుడు ఒక గంట పాటు గడువు విధించే ‘కూలింగ్-ఆఫ్ పీరియడ్’ విధానాన్ని అమలు చేయాలని భావిస్తోంది. ఈ వ్యవధిలో పంపిన వ్యక్తి తన లావాదేవీని మరోసారి పరిశీలించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ పొరపాటున లేదా మోసగాళ్ల ఒత్తిడి వల్ల డబ్బు పంపినట్లు గుర్తిస్తే, సదరు నగదు గ్రహీత ఖాతాలో జమకాకముందే ఆ లావాదేవీని రద్దు చేసుకునే వీలు కల్పించనున్నారు. సోషల్ ఇంజనీరింగ్ ద్వారా బాధితులను బెదిరించి డబ్బులు వసూలు చేసే ముఠాలకు ఈ గంట గడువు పెద్ద అడ్డంకిగా మారనుంది.

అయితే ఈ నిబంధన అందరికీ వర్తించకుండా కొన్ని కీలకమైన వెసులుబాట్లు కల్పించారు. వినియోగదారులు తమకు బాగా నమ్మకమైన వ్యక్తుల పేర్లను ముందే వైట్‌లిస్ట్ చేసుకుంటే వారికి డబ్బు పంపేటప్పుడు ఎలాంటి ఆలస్యం ఉండదు. అదేవిధంగా వ్యాపార సంబంధిత చెల్లింపులు, ఈ-మాండేట్ లావాదేవీలు, చెక్కులు, నాచ్ (NACH) వంటి విధానాలకు ఈ నియమం నుండి మినహాయింపు ఉంటుంది. దీనివల్ల నిత్యం వ్యాపార లావాదేవీలు నిర్వహించే వారికి ఇబ్బందులు కలగకుండా ఆర్‌బీఐ జాగ్రత్తలు తీసుకుంటోంది.

వృద్ధులను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న మోసాలను నివారించేందుకు కూడా ఆర్‌బీఐ ప్రత్యేక నిబంధనలను ప్రతిపాదిస్తోంది. 70 ఏళ్లు పైబడిన వారు రూ. 50,000 కంటే ఎక్కువ మొత్తాన్ని బదిలీ చేయాలంటే వారు ముందే సూచించిన ఒక విశ్వసనీయ వ్యక్తి అనుమతిని తప్పనిసరి చేయాలని భావిస్తున్నారు. దీనితో పాటు వ్యక్తిగత, చిన్న వ్యాపార ఖాతాలలో రూ. 25 లక్షలు దాటిన డిపాజిట్లకు అదనపు ధృవీకరణ అవసరమని పేర్కొంది. అలాగే అత్యవసర సమయంలో అన్ని డిజిటల్ సేవలను ఒక్క క్లిక్‌తో నిలిపివేసే ‘కిల్ స్విచ్’ వ్యవస్థను కూడా పరిశీలిస్తున్నారు.ఈ ప్రతిపాదనలపై మే 8, 2026 వరకు ప్రజల నుండి సలహాలు స్వీకరించి తుది నిర్ణయం తీసుకోనున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com