మే 10 ఎన్టీఆర్ ట్రస్ట్ తలసేమియా రన్‌కు నారా భువనేశ్వరి పిలుపు

- April 11, 2026 , by Maagulf
మే 10 ఎన్టీఆర్ ట్రస్ట్ తలసేమియా రన్‌కు నారా భువనేశ్వరి పిలుపు

హైదరాబాద్: తలసేమియా వ్యాధి పై అవగాహన పెంపొందించడం తో పాటు, వ్యాధిగ్రస్తులకు అండగా నిలవడానికి ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో మే 10న తలసేమియా రన్ నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరితో పాటు తలసేమియా రన్ బ్రాండ్ అంబాసిడర్ గా ఇండియన్ స్టార్ క్రికెటర్ మిథాలి రాజ్ పాల్గొన్నారు.

ప్రెస్ మీట్ లో ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి మాట్లాడుతూ... మీడియా మిత్రులకు, ఈ వేడుకకు విచ్చేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ తలసేమియా రన్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా విచ్చేసిన దిగ్గజ మహిళా క్రికెటర్ మిథాలి రాజ్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. తలసేమియా వ్యాధిపై అవగాహన పెంపొందించడం తో పాటు, బాధితులకు అండగా నిలవడం, ముఖ్యంగా బాధిత చిన్నారుల కోసం మీరందరూ ముందుకు వచ్చి రక్తదానం చేయడం..ఈ  తలసేమియా రన్ ప్రధాన లక్ష్యాలు. ఇది ఒక జన్యుపరమైన వ్యాధి.ఈ వ్యాధితో బాధపడుతున్న చిన్నారులు ప్రతి 21 రోజులకు ఒకసారి రక్త మార్పిడి చేసుకోవాల్సి ఉంటుంది. ఇది వారి కుటుంబాలకు తీవ్రమైన ఆర్థిక భారంగా మారుతోంది. ఈ ఆర్థిక భారం తగ్గించేందుకు ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్‌లో తలసేమియా కేర్ సెంటర్‌ను ఏర్పాటు చేశాము. ఇప్పటి వరకు 259 మంది చిన్నారులకు ఉచిత రక్త మార్పిడి చేశాము. అలాగే ఉచితంగా మందులు అందిస్తూ, భోజన సదుపాయాలను కూడా కల్పిస్తున్నాము.

ఈ వ్యాధిపై ప్రజల్లో చైతన్యం కల్పించడానికి 2023-24లో హైదరాబాద్‌లోని కేబీఆర్ పార్క్ వద్ద 5K వాక్ నిర్వహించాము. గత సంవత్సరం విశాఖపట్నంలోని ఆర్‌కే బీచ్ వద్ద తలసేమియా రన్ నిర్వహించగా, దాదాపు 15,000 మంది పాల్గొని చిన్నారులకు మద్దతుగా నిలబడ్డారు. ఆ స్పందనను నేను ఎప్పటికీ మర్చిపోలేను. మేము నిర్వహించిన తలసేమియా రన్/వాక్‌కు ప్రజల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. దాతలు కూడా పెద్ద ఎత్తున మద్దతు అందించారు. తలసేమియా వ్యాధి గురించి సమాజంలో ఇంకా చాలా మందికి అవగాహన లేదు. ముఖ్యంగా యువతీ యువకులు వివాహానికి ముందు తలసేమియా పరీక్ష చేయించుకోవడం చాలా అవసరం.

తలసేమియా అవగాహన కార్యక్రమంలో భాగంగా, ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 2026 మే 10వ తేదీ ఆదివారం ఉదయం 5 గంటలకు జలవిహార్ వద్ద 3K, 5K, 10K రన్ నిర్వహిస్తున్నాము. ఈ రన్‌లో మీరందరూ పాల్గొనాలని కోరుతున్నాము. ఈ వాలంటీర్ సేవా కార్యక్రమంలో దాతలు ముందుకు వచ్చి బాధిత చిన్నారులకు అండగా నిలవాలని మనస్పూర్తిగా అభ్యర్థిస్తున్నాను. http://thalassemia.org లేదా http://BookMyShow ద్వారా మీ పేర్లను నమోదు చేసుకోవచ్చు. అలాగే తలసేమియా చిన్నారుల కోసం ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ త్వరలోనే విజయవాడలో బ్లడ్ బ్యాంక్ మరియు తలసేమియా కేర్ సెంటర్‌ను ప్రారంభించనుంది. అవసరమైన చోట్ల మరిన్ని బ్లడ్ బ్యాంకులు, కేర్ సెంటర్లు ఏర్పాటు చేస్తాము. ఎన్టీఆర్ ట్రస్ట్ నిర్వహిస్తున్న సామాజిక సేవా కార్యక్రమాల్లో మీ అందరినీ పాల్గొనాలని ఆహ్వానిస్తున్నాను. దాతలకు, వాలంటీర్లకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. మీ అందరూ తలసేమియా రన్‌లో పాల్గొని సమాజానికి ఈ వ్యాధిపై అవగాహన కల్పిస్తారని, చిన్నారుల జీవితాల కోసం ముందడుగు వేస్తారని ఆశిస్తున్నాను.  ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు.

తల సేమియాన్ బ్రాండ్ అంబాసిడర్, ఇండియన్ స్టార్ క్రికెటర్ మిథాలీ రాజ్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఒక మాజీ క్రికెటర్‌గా మీడియా ప్రాముఖ్యత నాకు బాగా తెలుసు. క్రీడలను ప్రజలకు చేరవేయడంలో, వాటి ప్రాచుర్యాన్ని పెంచడంలో మీరు అందరూ చేసిన పాత్ర ఎంతో గొప్పది. ఇప్పుడు అదే విధంగా మీరు ఈ గొప్ప కార్యక్రమానికి కూడా ముందుకు రావాలని నేను కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఈ సోషల్ మీడియా కాలంలో, మీ ప్రతి పోస్ట్, ప్రతి షేర్, ప్రతి సందేశం ఎంతో ప్రభావం చూపుతుంది. ఇది చాలా ముఖ్యమైన కార్యక్రమం, తలసేమియా రన్ అంబాసడర్‌గా నేను మీ అందరినీ హృదయపూర్వకంగా అభ్యర్థిస్తున్నాను.. ఈ కార్యక్రమానికి మద్దతు ఇవ్వండి.

కొన్ని రోజుల క్రితం నేను ఎన్టీఆర్ ట్రస్ట్‌ను సందర్శించాను. అక్కడ కొన్ని పిల్లలను, వారి తల్లిదండ్రులను కలిసాను. వారు ఎదుర్కొంటున్న  ఇబ్బందులు, ఈ వ్యాధితో పోరాడుతున్న పరిస్థితి చూసి చాలా భావోద్వేగానికి లోనయ్యాను. మనం కలిసి పనిచేస్తే ఎంత గొప్ప ఫలితాలు సాధించగలమో మనకు తెలుసు.  మనందరం అవగాహన కలిస్పితే ఈ వ్యాధి రేటును కూడా తగ్గించగలుగుతాం. ఇదొక జెన్యు పరమైన వ్యాది. అవగాహన, కౌన్సెలింగ్ చాలా అవసరం. ఇది అంటువ్యాధి కాదు. కానీ ఈ విషయం గురించి తెలియని వారు తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంది. అందుకే మీడియా, ఇన్ఫ్లుయెన్సర్లు చాలా ముఖ్యమైన పాత్ర పోషించాలి. మీరు మీ ఫాలోవర్స్‌కి సరైన సమాచారం అందించాలి. వీడియోలు, పోస్టుల ద్వారా అవగాహన పెంచాలి. ఇది నివారణలో కీలకంగా ఉంటుంది.

ఈ రోజు మనందరీ ఆ గొంతును ఇలాంటి మంచి కార్యక్రమాల కోసం ఉపయోగిస్తే, ఇది ఇప్పటికే ఈ వ్యాధితో ఉన్న వారికి మాత్రమే కాకుండా, భవిష్యత్ తరాలకు కూడా ఎంతో మేలు చేస్తుంది. నన్ను ఈ మంచి కార్యక్రమంలో భాగస్వామి చేసినందుకు ధన్యవాదాలు. నేను నా వంతు సహాయం చేయడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాను'. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ ట్రస్ట్ సీఈవో,రిటైర్డ్ IPS కె. రాజేంద్ర కుమార్ తో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com