ఇరాన్‌తో మునుపటి సంబంధాలు అసాధ్యం..!!

- April 21, 2026 , by Maagulf
ఇరాన్‌తో మునుపటి సంబంధాలు అసాధ్యం..!!

యూఏఈః అమెరికా-ఇరాన్ చర్చల  కోసం ప్రపంచం ఎదురుచూస్తున్న తరుణంలో.. ఇరాన్ తో సంబంధాలపై యూఏఈ అధ్యక్షుడి సలహాదారు కీలక వ్యాఖ్యలు చేశారు. దక్షిణ టర్కీలోని అంటాల్యా డిప్లొమసీ ఫోరమ్‌లో యూఏఈ అధ్యక్షుడి దౌత్య సలహాదారు అన్వర్ గార్గాష్ మాట్లాడారు. ప్రపంచ దేశాలు కొత్త దశ రూపురేఖలను, మారుతున్న రాజకీయ పరిస్థితులను, అలాగే భవిష్యత్తులో ఏమి జరగబోతోందో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాయని అన్నారు.
"సమీక్ష మరియు హామీలు లేకుండా సంబంధాలలో మునుపటి స్థాయికి తిరిగి రావడం అసాధ్యం.  ఉద్రిక్తత, బెదిరింపులు,  దురాక్రమణను ఒక కొత్త వాస్తవంగా అంగీకరించడం ఆమోదయోగ్యం కాదు." అని ఆయన అన్నారు. యుఏఈ విషయానికొస్తే, గల్ఫ్ దేశాలు మరియు వారి ప్రజలపై ఇరాన్ క్రూరమైన దురాక్రమణ చేసిందని, ఇరాన్ తో ఇకపై మునుపటి సంబంధాలు అసాధ్యమని గర్గాష్ అన్నారు.
ఇజ్రాయెల్‌తో పోల్చినా కూడా ఇరాన్ దాడులకు యూఏఈయే అత్యంత ఎక్కువగా గురైన దేశమని వెల్లడించారు. ఈ దాడుల తీవ్రతను ఏ హేతుబద్ధమైన లెక్కలతోనూ వివరించలేమని ఆయన వాదించారు. యూఏఈపై 2,800కు పైగా ఇరాన్ క్షిపణులు మరియు డ్రోన్‌లు దాడి చేశాయని, వాటిలో 96 శాతాన్ని యూఏఈ అడ్డుకుందని ఆయన తెలిపారు. తమ దేశ రక్షణ సంసిద్ధతను ఇరాన్ తీవ్రంగా తప్పుగా అంచనా వేసిందనడానికి ఇది సాక్ష్యమని ఆయన పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా, ఐక్యరాజ్యసమితి అధికారులకు రాసిన ఒక లేఖలో అమెరికా-ఇరాన్ యుద్ధ సమయంలో టెహ్రాన్ దాడుల వల్ల గల్ఫ్ దేశానికి కలిగిన నష్టాలకు ఇరాన్ నుండి "పూర్తి పరిహారం" ఇవ్వాలని బహ్రెయిన్ కోరింది. ఇరాన్ దాడులపై ఒక గల్ఫ్ దేశం ఆందోళన వ్యక్తం చేయడం ఇది మొదటిసారి కాదు. మార్చి 25న ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండిస్తూ.. యూఏఈ, ఖతార్, కువైట్, బహ్రెయిన్, సౌదీ అరేబియా మరియు జోర్డాన్ దేశాలు ఒక సంయుక్త ప్రకటనను విడుదల చేశాయి. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com