కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం..ఏపీలో త్వరలో మరో కొత్త పథకం..!

- May 01, 2026 , by Maagulf
కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం..ఏపీలో త్వరలో మరో కొత్త పథకం..!

అమరావతి: ఏపీలో సీఎం చంద్రబాబు నాయుడు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. పేదల అభ్యున్నతి కోసం పలు కొత్త పథకాలను అమలు చేస్తోంది. అయితే, త్వరలో మరో కొత్త పథకానికి కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టబోతోంది. రాష్ట్రంలో అధిక సంతానాన్ని ప్రోత్సహిస్తూ పిల్లలే సంపద పేరిట కొత్త కార్యక్రమాన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. జనాభా నిర్వహణపై సీరియస్ గా దృష్టి సారించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రులు, ఉన్నతాధికారులను ఆదేశించారు.

రాష్ట్ర సచివాలయంలో మంత్రి మండలి సమావేశంలో మొత్తం 45 అంశాల పై సుదీర్ఘంగా చర్చించారు. రాష్ట్రంలో అధిక సంతానాన్ని ప్రోత్సహిస్తూ, పిల్లలే సంపద పేరిట కొత్త కార్యక్రమాన్ని అమలు చేయాలని సీఎం చంద్రబాబు భావిస్తున్నారు.అయితే, మంత్రి మండలి సమావేశంలో ఈ అంశంపై చర్చకు వచ్చింది. ప్రతి మూడో బిడ్డకు ప్రత్యేక ప్రోత్సాహం, మూడు నుంచి తదుపరి పిల్లలందరికీ అన్ని పథకాలు వర్తింపజేయాలని నిర్ణయించారు.

ఏపీలో జానాభా పెరుగుదలపై సర్కార్ దృష్టి సారించింది. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ ఏడాది మార్చి నెలలో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో చంద్రబాబు మాట్లాడుతూ.. మూడో బిడ్డను కనే మహిళలకు డెలివరీ సమయంలో రూ. 25వేలు ప్రోత్సాహకంగా ఇస్తామని ప్రకటించారు. ఇద్దరి కన్నా ఎక్కువ బిడ్డలను కంటే, ఆ పిల్లలకు ఐదు సంవత్సరాలు వచ్చే వరకు ప్రతి నెలా పోషణ కింద రూ.1000 ఆర్థిక సాయం అందిస్తామని, అలానే ఆ పిల్లలకు 18 ఏళ్లు వచ్చే వరకు ఉచిత విద్య అందిస్తామని ప్రకటించారు. మూడో సంతానం, ఆపై బిడ్డలనుకనే మహిళలకు 12నెలల పేరెంటల్ లీవ్ ఇచ్చేలా ప్రతిపాదనలు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. అయితే, తాజాగా.. పిల్లలే సంపద పేరుతో త్వరలో కొత్త పథకానికి శ్రీకారం చుట్టేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది.

తాజాగా జరిగిన కేబినెట్ సమావేశంలో వేసవిలో చలివేంద్రాల ఏర్పాటు, అవసరమైతే మజ్జిగ పంపిణీ చేసే విధంగా ఇన్ ఛార్జి మంత్రులు స్పందించాలని సీఎం చంద్రబాబు సూచించారు. నిరంతరం ప్రజలతో మమేకం కావాలి.. ప్రాంతాల వారీగా ప్రాధాన్యాలను గుర్తించి వాటిని పరిష్కరించాలని పునరుద్ఘాటించారు. డీజిల్, పెట్రోల్ లాంటి అంశాల్లో కూడా ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేందుకు ప్రతిపక్ష పార్టీ చూస్తుందని, అయితే, వారికి ధీటుగా సమాధానం చెప్పలేక పోతున్నారని సీఎం చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. విపక్ష ఆరోపణలకు గట్టి కౌంటర్ ఇవ్వడంతో పాటు ప్రజలకు వాస్తవాలను వివరించాలని సీఎం చంద్రబాబు మంత్రులకు సూచించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com