సీబీఎస్ఈ తాజా నిబంధన నుండి యూఏఈ స్కూళ్లకు మినహాయింపు..!!

- May 18, 2026 , by Maagulf
సీబీఎస్ఈ తాజా నిబంధన నుండి యూఏఈ స్కూళ్లకు మినహాయింపు..!!

యూఏఈ: భారత సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) 9, 10 తరగతుల భాషా విధానంలో చేసిన మార్పులు.. 2026-27 విద్యా సంవత్సరం నుండి యూఏఈ పాఠశాలల్లో చదువుతున్న వేలాది మంది భారతీయ విద్యార్థులపై కొత్త నిబంధనలు ఎలా ప్రభావం చూపుతాయనే ఆందోళనలను రేకెత్తిస్తోంది.   

జూలై 1, 2026 నుండి 9వ తరగతిలో ప్రవేశించే విద్యార్థులు, భారతదేశ జాతీయ విద్యా విధానం (NEP) 2020 మరియు పాఠశాల విద్య కోసం జాతీయ పాఠ్యప్రణాళిక ఫ్రేమ్‌వర్క్ (NCF-SE) 2023కు అనుగుణంగా చేసిన సంస్కరణలలో భాగంగా, R1, R2 మరియు R3గా వర్గీకరించబడిన మూడు భాషలను అభ్యసిస్తారు.

విద్యార్థులు రెండు భారతీయ మాతృభాషలను అభ్యసించాలనే నిబంధన యూఏఈ పాఠశాలలకు ఉన్న అతిపెద్ద ఆందోళనలలో ఒకటిగా ఉంది. అయితే, ఈ మార్గదర్శకాలు గల్ఫ్ పాఠశాలలకు R3 కింద అరబిక్‌ను కొనసాగించడానికి తగినంత వెసులుబాటును కల్పిస్తున్నాయని, అలాగే 10వ తరగతిలో విద్యార్థులు ఆ సబ్జెక్టులో అదనపు బోర్డు పరీక్షకు హాజరు కావలసిన అవసరం లేదని యూఏఈలోని భారతీయ స్కూల్స్ ప్రిన్సిపాల్‌లు చెబుతున్నారు.

సీబీఎస్ఈ సవరించిన విధానం కింద విదేశీ పాఠశాలలకు ఎటువంటి సమస్య లేదని, విదేశీ సంస్థలకు కేవలం ఒక భారతీయ మాతృభాష మాత్రమే తప్పనిసరి అని షార్జా ఇండియన్ స్కూల్ ప్రిన్సిపాల్ ప్రమోద్ మహాజన్ తెలిపారు. R1 ఇంగ్లీషులో ఉండవచ్చు, R2 లో హిందీ, మలయాళం, ఉర్దూ లేదా తమిళం ఉండవచ్చని,  అలాగే యూఏఈ విద్యార్థులకు R3లో అరబిక్‌లో ఉండవచ్చని ఆయన పేర్కొన్నారు. R3ని బోర్డు ఇవాల్యుయేషన్ చేయదు, కానీ ఇంటర్నల్ అసెస్ మెంట్ మరియు గ్రేడింగ్ ఆధారంగా తుది మార్క్‌షీట్‌లో కలుపుతుందని  ఆయన అన్నారు. 26 దేశాలలో సీబీఎస్ఈకి ఉన్న స్కూళ్లలో R3 దేశాన్ని బట్టి మారుతుందని మహజన్ తెలిపారు.  ఈ విధానంలో ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులకు (పీపుల్ ఆఫ్ డిటర్మినేషన్) మరియు విదేశీ పాఠశాలలు, భారతదేశం మధ్య మారే విద్యార్థులకు మినహాయింపులు ఉన్నాయని కూడా ఆయన పేర్కొన్నారు.

విదేశీ పాఠశాలల్లో ఆందోళన  

యూఏఈలోని CBSE పాఠశాలల్లో చదువుతున్న భారతీయులు కాని విద్యార్థులకు ఈ నిబంధన ఎలా వర్తిస్తుందనేది తమ అతిపెద్ద ఆందోళనలలో ఒకటని విద్యావేత్తలు పునరుద్ఘాటించారు. కాస్మోపాలిటన్ ఇంటర్నేషనల్ ఇండియన్ స్కూల్ ప్రిన్సిపాల్ ముహమ్మద్ అలీ కొట్టక్కుల్మ్ మాట్లాడుతూ..  పాఠశాలలు ఇప్పటికే త్రిభాషా సూత్రాన్ని అమలు చేయడానికి సిద్ధమవుతున్నాయని, అయితే మునుపటి నిబంధన సవాళ్లను విసిరిందని అంగీకరించారు. R1, R2 మరియు R3లలో రెండు భారతీయ భాషలు అయి ఉండాలనే నిబంధన, ముఖ్యంగా వారి జాతీయతలకు చెందిన విద్యార్థులకు పెద్ద సవాలుగా నిలిచిందని ఆయన అన్నారు.

అయితే, ఎలాంటి మినహాయింపులు ఇస్తారో సీబీఎస్ఈ ఇంకా స్పష్టం చేయనప్పటికీ, స్వదేశానికి తిరిగి వస్తున్న విదేశీ విద్యార్థులకు ఒక్కో కేసును బట్టి ప్రత్యేక పరిగణనలు అందిస్తోందని  ఆయన వివరించారు. విదేశీ పాఠశాలల నిర్దిష్ట అవసరాలను తీరుస్తుందని భావిస్తున్న సీబీఎస్ఈ ప్రతిపాదిత గ్లోబల్ కరికులం కోసం గల్ఫ్‌ లోని పాఠశాలలు కూడా ఎదురుచూస్తున్నాయని కొట్టక్కుళం అన్నారు.

ఫ్రెంచ్ భాషపై ఆందోళన

ఆర్3గా అరబిక్ వల్ల ఇబ్బందులు తలెత్తే అవకాశం లేదని పాఠశాలలు చెబుతున్నప్పటికీ, సవరించిన విధానం కింద ఫ్రెంచ్ వంటి విదేశీ భాషల భవిష్యత్తుపై కొన్ని సంస్థలు ఆందోళన చెందుతున్నాయి. షైనింగ్ స్టార్ ఇంటర్నేషనల్ స్కూల్ ప్రిన్సిపాల్ అభిలాష సింగ్ మాట్లాడుతూ.. తమ పాఠశాలలో ఇప్పటికే హిందీ, ఉర్దూ, మలయాళం, తమిళం, ఫ్రెంచ్ అనే ఐదు భాషలను బోధిస్తున్నట్లు తెలిపారు.

పాఠశాలలు తప్పనిసరిగా రెండు స్థానిక భారతీయ భాషలను అందించాలని సీబీఎస్ఈ నుండి వచ్చిన ఇటీవలి సర్క్యులర్ స్పష్టంగా సూచిస్తోందని అన్నారు. అన్ని పాఠశాలలు ఆర్3గా అరబిక్‌ను తీసుకుంటాయి. కాబట్టి ఆర్3 సమస్య కాదని తెలిపారు.  ఆర్3 కోసం విద్యార్థులు 10వ తరగతిలో బోర్డు పరీక్ష రాయనవసరం లేదని కూడా పేర్కొన్నారు.

అయితే, R2 కింద ప్రస్తుతం ఫ్రెంచ్ అందిస్తున్న పాఠశాలలు కొత్త విధానం కింద ఇబ్బందులు ఎదుర్కోవచ్చని సింగ్ అన్నారు. ఫ్రెంచ్ అందిస్తున్న పాఠశాలలకు R2 ఒక సవాలుగా మారిందని అన్నారు. రాబోయే సంవత్సరాల్లో, విదేశీ పాఠశాలల కోసం గ్లోబల్ కరికులం రాబోతున్నందున, ఫ్రెంచ్‌ను కూడా అంగీకరిస్తారని తాము ఆశిస్తున్నట్టు పేర్కొన్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com