పర్సంటేజ్ కోసం పట్టు.. థియేటర్ల వివాదంపై రంగంలోకి చిరంజీవి..

- May 25, 2026 , by Maagulf
పర్సంటేజ్ కోసం పట్టు.. థియేటర్ల వివాదంపై రంగంలోకి చిరంజీవి..

హైదరాబాద్: సింగిల్ స్క్రీన్ థియేటర్ల సమస్యలని మెగాస్టార్ చిరంజీవి అర్ధం చేసుకున్నారు. ఎగ్జిబిటర్లుకు మాటిచ్చారు. వివరాలు రెండురోజుల్లో ఛాంబర్‌ అధికారికంగా ప్రకటిస్తుంది: తెలంగాణ ఎఫ్‌డీసీ ఛైర్మన్‌ దిల్‌ రాజు.

సింగిల్ స్క్రీన్స్ కి పర్సెంటేజ్ విషయంలో ప్రస్తుతం నెలకొన్న సమస్యని తెలుగు సినీ పరిశ్రమ పెద్దలు ఈ రోజు మెగాస్టార్ చిరంజీవి గారి దృష్టికి తీసుకొచ్చారు. తెలంగాణ ఎఫ్‌డీసీ ఛైర్మన్‌ దిల్‌ రాజు, TFCC  ప్రెసిడెంట్ సురేశ్‌బాబు, నిర్మాతలు కేఎల్‌ నారాయణ, అల్లు అరవింద్‌, తెలంగాణ ఛాంబర్‌ ఎగ్జిబిటర్లు తదితరులు మెగాస్టార్ చిరంజీవి తో సమావేశమయ్యారు.

విషయాలన్నీ పూర్తిగా విన్న చిరంజీవి గారు పరిశ్రమ లో భాగస్వాములయిన అందరికీ పూర్తి న్యాయం జరిగేలా వుండాలని, ఒక్క సినిమా గురించో, ఒక్క సెక్టార్ గురించో ఈ చర్చ కాదని, అందరికీ ఆమోదయోగ్యంగా వుండాలనే పరిశ్రమ కొన్ని పద్దతులను ఏర్పరుచుకుంది అన్నారు.  

తెలుగు చిత్ర పరిశ్రమకి హైయెస్ట్ బాడీ తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అన్న విషయాన్ని గుర్తు చేసి, ఆ ఛాంబర్ తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి వుండటం అందరికీ సముచితం అన్నారు.

ఇంతకు ముందు వేసిన వేరే కమిటీల పని తీరు, ఫలితాల పట్ల సింగిల్ స్క్రీన్స్ సభ్యులలో కొంత అసంతృప్తి, అపనమ్మకం వుందన్న విషయం అర్ధం అయిందన్నారు. ఈ సారి ఛాంబర్ ఏర్పాటు చేసిన కమిటీ అనుకున్న గడువులో అంటే జూన్ 30 వ తేదీ వరకూ , అన్ని విషయాలని పూర్తిగా పరిశీలించి ప్రొడ్యూసర్స్ , డిస్ట్రిబ్యూటర్ర్స్, ఎక్సహిబిటర్స్ అందరికీ న్యాయం జరిగేలా పర్సెంటేజ్ మోడల్ మీద ప్రతిపాదనని చేస్తుందని తనకు నమ్మకం వుందని, ఆ కమిటీ సకాలంలో తన బాధ్యతలు పూర్తిచేసి నివేదిక ఇవ్వటానికి తనవంతు కూడా పూర్తి ప్రయత్నం చేస్తానని చిరంజీవి గారు హామీ ఇచ్చారు.

చిరంజీవి సమయం వెచ్చించి తమకున్న సమస్యలని, భయాలని, ప్రస్తుతం సింగిల్ స్క్రీన్స్ కి వున్న పరిస్థితులని అవగాహన చేసుకుని అందరికీ న్యాయం జరిగేలా చూస్తానని భరోసా ఇవ్వటం పట్ల సభ్యులందరూ పూర్తి సంతృప్తి వ్యక్తం చేశారు. వారి అసోసియేషన్స్ లో వున్న మిగతా సభ్యులందరికి ఈ సమావేశం గురించి తెలియచేసి 24 గంటలలో తమ ఆమోదాన్ని తెలియచేస్తామని తెలిపారు.

సమావేశం అనంతరం మీడియాతో తెలంగాణ ఎఫ్‌డీసీ ఛైర్మన్‌ దిల్‌ రాజు మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఈరోజు తెలంగాణ చాంబర్ ఎగ్జిబిటర్స్ ప్రతినిధులు, సురేష్ బాబు గారు, కేఎల్ నారాయణ గారు, నేను కలిసి చిరంజీవి గారిని కలిశాం. అనంతరం అల్లు అరవింద్ గారు కూడా సమావేశంలో పాల్గొన్నారు. పర్సెంటేజ్ విధానానికి సంబంధించి ఎగ్జిబిటర్స్ ఎదుర్కొంటున్న సమస్యలను చిరంజీవి గారికి వివరించాం. సమస్యలను చిరంజీవి గారు ఎంతో శ్రద్ధగా విన్నారు. అర్ధం చేసుకున్నారు. ఎగ్జిబిటర్స్ కి మాటిచ్చారు. వారం కిందట ఛాంబర్‌ ఏర్పాటు చేసిన కమిటీ నుంచి మరిన్ని వివరాలు తెప్పించుకుని పరిశీలిస్తానన్నారు. సమస్యని కమిటీకి అప్పగించి కమిటీ ద్వారా రెండు రోజుల్లో పరిష్కారిస్తామని చెప్పారు. అందుకు సంబంధించిన వివరాలను ఛాంబర్‌ అధికారికంగా ప్రకటిస్తుంది. ప్రస్తుతం ఎగ్జిబిటర్స్ అందరూ సంతోషంగా ఉన్నారు.

శ్రీధర్ మాట్లాడుతూ: మేము చిరంజీవి గారిని కలిసి మా సమస్యలను వివరించాం. ఆయన నుంచి చాలా మంచి స్పందన వచ్చింది. దాదాపు గంట పది నిమిషాల పాటు సమావేశం జరిగింది. ఎగ్జిబిటర్స్ ఎదుర్కొంటున్న ఇబ్బందులు, మూతపడుతున్న థియేటర్ల పరిస్థితి వంటి అన్ని అంశాలను ఆయనకు వివరించాం. చిరంజీవి గారు మా సమస్యలను పూర్తిగా విన్నారు. ఇప్పటికే ఏర్పాటైన కమిటీతో కూడా మాట్లాడతానని హామీ ఇచ్చారు. మేము కూడా ఎగ్జిబిటర్స్‌తో మరోసారి సమావేశమై చర్చించి తుది నిర్ణయాన్ని చెప్తాం. అందరికీ ధన్యవాదాలు.

ఈ సమావేశంలో TFCC ప్రెసిడెంట్ సురేష్ బాబు, అల్లు అరవింద్ , TFDC చైర్మన్ దిల్ రాజు, ప్రముఖ నిర్మాతలు కే ఎల్ నారాయణ, సునీల్ నారంగ్ , భరత్ నారంగ్ , తెలంగాణ ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్ శేఖర్, అనుపమ్, శ్రీధర్, సదానంద్ గౌడ్ , సుదర్శన్ థియేటర్ ప్రొప్రయిటర్  రాజ్ తదితరులు పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com