విజయవాడ ఎయిర్‌పోర్టులో విదేశీ ప్రయాణికులకు ఎబోలా పరీక్షలు

- May 27, 2026 , by Maagulf
విజయవాడ ఎయిర్‌పోర్టులో విదేశీ ప్రయాణికులకు ఎబోలా పరీక్షలు

విజయవాడ: ఆఫ్రికా దేశాల్లో ఎబోలా వైరస్ కేసులు, మరణాలు వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. వైరస్ రాష్ట్రంలోకి ప్రవేశించకుండా ఉండేందుకు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటుంది. అందులో భాగంగా మంగళవారం విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎబోలా వైరస్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించారు. కేంద్రపౌర విమానయాన శాఖ ఆదేశాల మేరకు విదేశీ ప్రయాణికులకు ఈ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. మంగళవారం ఉదయం సింగపూర్ నుంచి తరలివచ్చిన ప్రయాణికులకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ఆదేశాల మేరకు ఆరోగ్య సిబ్బంది ఎబోలా వైరస్ పరీక్షలు చేపట్టారు. తొలిరోజు మొత్తం 185 మందికి వైద్య పరీక్షలు నిర్వహించినట్లు వైద్య అధికారి డాక్టర్ సృజన తెలిపారు. ప్రయాణికుల ఆరోగ్య పరిస్థితిని పరిశీలించి, అవసరమైన జాగ్రత్తలు తీసుకున్నామని వెల్లడించారు.

విదేశాల నుంచి వచ్చే ప్రయాణికుల ఆరోగ్య భద్రత కోసం విమానాశ్రయంలో నిరంతర పర్యవేక్షణ కొనసాగిస్తున్నట్లు ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. వైరస్ గబ్బిలాల నుంచి మనషులకు సోకుతుంది. ఈ వైరస్ సోకిన వ్యక్తి శారీరక ద్రవాలు, రక్తాన్ని తాకినప్పుడు ఒకరి నుంచి మరొకరికి ఈ ఎబోలా వైరస్ వ్యాప్తిచెందే అవకాశం ఉంది ఈ ప్రాణాంతకమైన ఎబోలా వైరస్ 21 రోజు లపాటు రోగిలో సజీవంగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. జ్వరం, అలసట, నీర సం, కండరాల నొప్పి, తలనొప్పి, గొంతు నొప్పి, వాంతులు, విరేచనాలు, కడుపు నొప్పి, దద్దుర్లు, ఇంకా మూత్రపిండాలు, కాలేయ పనితీరు దెబ్బ తినడం వంటి లక్షణాలు ఎబోలా వైరస్ సోకిన వారిలో కనిపిస్తాయని వివరించారు. ఇప్పటికే ఎబోలా వైరస్ రాష్ట్రంలోకి ప్రవేశించకుండా ఉండేందుకు తక్షణమే ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఇప్పటికే అధికారులను ఆదేశించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ జారీ చేసిన హెచ్చరికల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్రాలను అప్రమత్తం చేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com