రాజస్థాన్‌లో ఘోర ప్రమాదం..నలుగురు సజీవ దహనం!

- May 28, 2026 , by Maagulf
రాజస్థాన్‌లో ఘోర ప్రమాదం..నలుగురు సజీవ దహనం!

అజ్మీర్ జిల్లా బోరాడ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం తెల్లవారుజామున ఈ ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. స్థానిక కాంగ్రెస్ నాయకుడు, మాజీ సర్పంచ్ అయిన రామ్‌సింగ్ చౌదరి తల్లికి అకస్మాత్తుగా గుండెనొప్పి (Heart Attack) వచ్చింది. దీంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు ఆమెను అత్యవసర చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించేందుకు కారులో వేగంగా బయలుదేరారు.

కారు ఆసుపత్రికి వెళ్తున్న మార్గమధ్యంలో.. ఊహించని విధంగా కారు ఇంజిన్‌లో ఒక్కసారిగా షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగావు. క్షణాల వ్యవధిలోనే ఆ మంటలు కారు మొత్తం వ్యాపించాయి. లోపల ఉన్నవారు అప్రమత్తమై బయటకు వచ్చేలోపే కారు సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ (Central Locking System) జామ్ అయిపోయింది. తలుపులు తెరుచుకోకపోవడంతో కారు లోపల ఉన్న రామ్‌సింగ్ చౌదరి, ఆయన భార్య, ఆయన తల్లి మరియు జిల్లా పరిషత్ సభ్యురాలు పూసీ దేవి కారులోనే చిక్కుకుపోయారు. బయటకు వచ్చేందుకు వారు తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ సాంకేతిక లోపం వల్ల డోర్లు లాక్ అయిపోవడంతో, మంటల ధాటికి నలుగురూ కారులోనే సజీవ దహనమయ్యారు.

స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న బోరాడ పోలీసులు.. కారులో ఉన్న నలుగురు మృతి చెందినట్లు నిర్ధారించారు. కారు ఇంజిన్‌లో మంటలు ఎలా చెలరేగాయి? లాకింగ్ సిస్టమ్ విఫలం కావడానికి గల కారణాలపై ఫోరెన్సిక్ బృందాల సహాయంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. కాంగ్రెస్ నేత కుటుంబం ఇలా దారుణంగా ప్రాణాలు కోల్పోవడంతో స్థానిక రాజకీయ వర్గాల్లో మరియు గ్రామంలో తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తమవుతోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com