దుబాయ్‌లో బస్సు ప్రమాదం..ఇంకా ముగ్గురి పరిస్థితి విషమం..!!

- June 10, 2026 , by Maagulf
దుబాయ్‌లో బస్సు ప్రమాదం..ఇంకా ముగ్గురి పరిస్థితి విషమం..!!

దుబాయ్‌: దుబాయ్‌లోని ఎమిరేట్స్ రోడ్‌ పై ఆదివారం జరిగిన ఘోరమైన మినీబస్సు ప్రమాదంలో గాయపడ్డ ముగ్గురు వ్యక్తుల పరిస్థితి ఇంకా విషమంగా ఉందని ఒక సామాజిక కార్యకర్త తెలిపారు. ఈ ప్రమాదంలో ఏడుగురు మరణించగా, తొమ్మిది మంది గాయపడ్డారని పోలీసులు తెలిపారు. ఈ ఘటన తర్వాత మొత్తం ఎనిమిది మందిని ఆసుపత్రిలో చేర్చగా, వారిలో నలుగురు డిశ్చార్జ్ అయ్యారని, ముగ్గురు కార్మికులు పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని పోలీసులు వెల్లడించారు. వీరితో ఇద్దరు భారతీయులు మరియు ఒక నేపాలీ వ్యక్తి ఉన్నారు.  

సాంకేతిక లోపం కారణంగా హైవే పక్కన నిలిపి ఉంచిన ట్రక్కును మినీబస్సు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. బస్సు డ్రైవర్ అప్రమత్తంగా లేకపోవడం మరియు సురక్షిత దూరాన్ని పాటించకపోవడం వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్దారించారు.

ప్రమాదం జరిగిన సమయంలో మినీబస్సులో మొత్తం 16 మంది ఉన్నారు. వారందరూ యూఏఈకి చెందిన ఒక సాంకేతిక సేవల సంస్థ ఉద్యోగులు. ఈ సంస్థ అల్యూమినియం క్లాడింగ్, గ్లాస్ ఇన్‌స్టాలేషన్ మరియు ఇతర నిర్వహణ సేవలను (handyman services) అందిస్తుంది. మృతుల్లో ఆరుగురు భారతీయులు మరియు ఒకరు శ్రీలంకకు చెందినవారు ఉన్నారు. కార్మికులు పని ప్రదేశం నుండి తమ నివాసానికి తిరిగి వస్తుండగా సంభవించిందని సంస్థ ప్రతినిధి తెలిపారు.

సామాజిక కార్యకర్త తెలిపిన వివరాల ప్రకారం, మరణించిన వారి మృతదేహాలను గుర్తించే ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. మృతదేహాలు తీవ్రంగా దెబ్బతిని గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నాయని, దాంతో గుర్తింపు ప్రక్రియ సవాలుగా మారిందన్నారు.  

ఇదిలా ఉండగా, భారత కాన్సులేట్ అధికారులు ఆసుపత్రిని సందర్శించి గాయపడిన వారిని పరామర్శించారు. బాధితులకు సాధ్యమైనంత సహాయం అందేలా స్థానిక అధికారులతో కలిసి పనిచేస్తున్నట్లు వారు తెలిపారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com