కృష్ణలంక ఘటన పై ఏపీ ప్రభుత్వం సీరియస్..

- June 18, 2026 , by Maagulf
కృష్ణలంక ఘటన పై ఏపీ ప్రభుత్వం సీరియస్..

విజయవాడ: ఏపీలో సంచలనం సృష్టించిన కృష్ణలంక ఘటన పై ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌ అయింది. కృష్ణలంక పీఎస్ పరిధిలో గాదె సాయికృష్ణ లాకప్ డెత్ ఘటనకు సంబంధించి సమగ్ర విచారణ చేపట్టాల్సిందిగా అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. లాకప్‌లోనే కొట్టి గాదె సాయికృష్ణను చంపారంటూ వస్తున్న ఆరోపణలపై ఉన్నత స్థాయి విచారణ జరపాలని, నిజనిజాలు నిగ్గు తేల్చాలంటూ సీఎం డీజీపీని ఆదేశించారు.

బుధవారం (జూన్ 17)న సచివాలయంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. సింగపూర్ పర్యటన ముగించుకుని సచివాలయానికి చేరుకున్న వెంటనే ఈ సమావేశాన్ని నిర్వహించారు.

సాయికృష్ణ అదృశ్యం ఘటనపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో కలిసి సీఎం చంద్రబాబు సమీక్షించారు. దాదాపు గంటన్నర పాటు సీఎం, డిప్యూటీ సీఎం సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ప్రధానంగా కృష్ణలంక పీఎస్ ఘటనతో పాటు తాజా రాజకీయ పరిణామాలపై కూడా చర్చించారు.

నిష్పక్షపాతంగా విచారణ జరపండి:
డీజీపీ, విజయవాడ సీపీ, ఇంటెలిజెన్స్ ఏడీజీ ఇతర ఉన్నతాధికారులను కార్యాలయానికి పిలిపించి వివరణ అడిగారు. సీఐ నాగరాజును వెంటనే సస్పెండ్ చేయాలని పోలీస్ ఉన్నతాధికారులను ఆదేశించారు.

అంతేకాదు.. సీనియర్ ఐపీఎస్ అధికారితో దర్యాప్తు చేయించాల్సిందిగా సీఎం నిర్ణయించారు. సాయికృష్ణ ఘటనపై నిష్పక్షపాతంగా విచారణ జరిపి వెంటనే నివేదిక ఇవ్వాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీని చంద్రబాబు ఆదేశించారు.

అయితే, ఇప్పటికే సీఐ నాగరాజును వీఆర్‌కు పంపినట్టు డీజీపీ వివరణ ఇచ్చారు. కాగా, సమీక్షా సమావేశంలో సీఎస్ సాయి ప్రసాద్, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, ఇంటెలిజెన్స్ చీఫ్ మహేష్ చంద్ర లడ్హ, విజయవాడ సీపీ రాజశేఖర్ బాబు పలువురు పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com