సాయికృష్ణ కేసుతో రాజకీయ కలకలం..జూన్ 29న హైకోర్టు డెడ్లైన్ పై ఉత్కంఠ!
- June 18, 2026
విజయవాడ: విజయవాడ కృష్ణలంకకు చెందిన గాదె సాయికృష్ణ అనే రౌడీషీటర్ అదృశ్యం ఉదంతం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా తీవ్ర రాజకీయ సంచలనంగా మారింది. గత నెల రోజులుగా సాయికృష్ణ ఆచూకీ లేకపోవడం, దీని వెనుక పోలీసుల హస్తం ఉందనే ఆరోపణలు వెల్లువెత్తడంతో కూటమి ప్రభుత్వం రంగంలోకి దిగింది. ఈ వ్యవహారంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లు ప్రత్యేకంగా భేటీ అయి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
లాకప్ డెత్ అంటూ వైసీపీ సంచలన ఆరోపణలు
కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. పలు కేసుల్లో రౌడీషీట్ ఉన్న గాదె సాయికృష్ణ ప్రకాశం జిల్లా మార్కాపురానికి వలస వెళ్ళాడు. 2026 మే 9వ తేదీన కృష్ణలంక పోలీసులు మార్కాపురం వెళ్లి అతడిని అదుపులోకి తీసుకున్నారు. అయితే, అప్పటి నుంచి సాయికృష్ణ ఇంటికి రాలేదని, కోర్టులోనూ హాజరుపరచలేదని అతని తల్లి గాదె విజయలక్ష్మి కన్నీరుమున్నీరవుతున్నారు. “నీ కొడుకు చనిపోయాడనుకో” అంటూ కృష్ణలంక సీఐ నాగరాజు తనతో దారుణంగా మాట్లాడారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు, ఈ కేసుపై మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు స్పందిస్తూ.. సాయికృష్ణను పోలీసులు కృష్ణలంక స్టేషన్లోనే కొట్టి లాకప్ డెత్ చేశారంటూ సంచలన ఆరోపణలు చేయడం కలకలం రేపింది.
హైకోర్టు డెడ్లైన్పై ఉత్కంఠ!
ఈ కేసులో బెజవాడ బార్ అసోసియేషన్ జోక్యం చేసుకోవడంతో కీలక మలుపు తిరిగింది. సాయికృష్ణను కోర్టు ముందు ప్రవేశపెట్టాలంటూ జూన్ 4న ఏపీ హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలైంది. దీనిపై విచారణ జరిపిన కోర్టు, జూన్ 29 లోగా సాయికృష్ణను తమ ముందు హాజరుపరచాలని పోలీసులను అదేశించింది. ఈ పరిణామాల నేపథ్యంలో బుధవారం సాయంత్రం సీఎం చంద్రబాబు, డెప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. బాధ్యుడైన సీఐ నాగరాజును తక్షణమే సస్పెండ్ చేయాలని డీజీపీని సీఎం ఆదేశించారు. అలాగే, ఈ కేసుపై సీనియర్ ఐపీఎస్ అధికారితో సమగ్ర దర్యాప్తు జరిపించి నివేదిక ఇవ్వాలని స్పష్టం చేశారు. ఇప్పటికే ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు సదరు సీఐని వీఆర్కు పంపగా, ఇప్పుడు సస్పెన్షన్ వేటు పడింది. జూన్ 29న కోర్టులో పోలీసులు ఎలాంటి నివేదిక ఇస్తారనే దానిపైనే ఇప్పుడు అందరి దృష్టి నెలకొంది.
తాజా వార్తలు
- రోడ్డు ప్రమాదంలో గల్ఫ్ కార్మికుడు శ్రీనివాస్ మృతి
- విటమిన్ డి లోపం రిస్క్ పై నిపుణులు హెచ్చరిక..!!
- సలాలాలో కాల్పుల కలకలం..ఇద్దరికి గాయాలు..!!
- కీలక ఓవర్నైట్ రేటును 4.25% వద్దే పెట్టిన సీబీబీ..!!
- ఆర్థిక సహకారానికి ముందు ఇరాన్ విశ్వాసాన్ని పునరుద్ధరించాలి..!!
- యూఏఈ గ్రోసరీ బిల్లులు ఎప్పుడు తగ్గుతాయి?
- కువైట్ T4 కార్యకలాపాలు విస్తరణ..!!
- వేధింపులు భరించలేక షార్ట్ ఫిల్మ్ నటి అమూల్య శ్రీ ఆత్మహత్య
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా పై నిషేధం
- సాయికృష్ణ కేసుతో రాజకీయ కలకలం..జూన్ 29న హైకోర్టు డెడ్లైన్ పై ఉత్కంఠ!









