రోడ్డు ప్రమాదంలో గల్ఫ్ కార్మికుడు శ్రీనివాస్ మృతి

- June 18, 2026 , by Maagulf
రోడ్డు ప్రమాదంలో గల్ఫ్ కార్మికుడు శ్రీనివాస్ మృతి

దుబాయ్‌లో తెలంగాణ గల్ఫ్ గంగపుత్ర ఐక్యత సంక్షేమ సంఘం ఘన నివాళి

దుబాయ్/రుద్రంగి: దుబాయ్‌లో పనిచేస్తున్న గల్ఫ్ కార్మికుడు, తెలంగాణ గల్ఫ్ గంగపుత్ర ఐక్యత సంక్షేమ సంఘం సభ్యుడు యెల్ల శ్రీనివాస్ గంగపుత్ర రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం తీవ్ర విషాదాన్ని నింపింది. ఇటీవల సెలవులపై స్వదేశానికి వెళ్లిన శ్రీనివాస్, బంధువుల ఇంటి నుంచి తిరిగి వస్తుండగా రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

శ్రీనివాస్ ఆకస్మిక మరణవార్త తెలిసిన వెంటనే దుబాయ్‌లోని తెలంగాణ గల్ఫ్ గంగపుత్ర ఐక్యత సంక్షేమ సంఘం సభ్యులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన సంతాప సభలో శ్రీనివాస్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ సభ్యులంతా ఐదు నిమిషాల పాటు మౌనం పాటించారు.

కుటుంబానికి రూ.5 లక్షల పరిహారం ఇవ్వాలి

ఈ సందర్భంగా సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన ఎన్నారై (NRI) విధానాన్ని తక్షణమే అమలు చేసి ప్రమాదవశాత్తూ మృతి చెందిన గల్ఫ్ కార్మికుడు యెల్ల శ్రీనివాస్ కుటుంబానికి రూ.5 లక్షల ఆర్థిక సాయం అందించాలని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డిని కోరారు. కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు.

పలువురు సభ్యుల పాల్గొన్నారు 

నివాళుల కార్యక్రమంలో GWAC గల్ఫ్ వింగ్ అధ్యక్షుడు రవి కటుకం, తెలంగాణ గల్ఫ్ గంగపుత్ర ఐక్యత సంక్షేమ సంఘం అధ్యక్షుడు తోకల శంకర్, ఉపాధ్యక్షుడు బింగి రాజు, ప్రధాన కార్యదర్శి పల్లికొండ గంగా నరసన్నతో పాటు పుట్టి రాజు, బింగి నరసయ్య, ఉట్నూర్ నరసన్న, ఇంటెప్పు నరేష్, మేడి రమేష్, పల్లికొండ అనిల్, జుంబర్తి నరేష్, జుంబర్తి తిరుపతి, కల్లెడ మహేష్, కొండ్రా నారాయణ, బింగి పోచన్న, మేడి సుధాకర్, కునారపు రాకేష్ తదితరులు పాల్గొని అశ్రునయనాలతో నివాళులర్పించారు.

శ్రీనివాస్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, ఈ విషాదాన్ని తట్టుకునే ధైర్యాన్ని దేవుడు ప్రసాదించాలని సంఘం సభ్యులు ఆకాంక్షించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com