సోషల్ మీడియాలో అక్రమ వీసా సేవలపై దుబాయ్ అధికారుల కొరడా
- June 19, 2026
అనధికార ఖాతాల పై చర్యలు.. అధికారిక మార్గాల ద్వారానే సేవలు పొందాలని సూచన
దుబాయ్: సోషల్ మీడియా వేదికల ద్వారా అనధికారికంగా వీసా, రెసిడెన్సీ సేవలను ప్రచారం చేస్తున్న పలు ఖాతాలపై దుబాయ్ అధికారులు కఠిన చర్యలు చేపట్టారు. ఇలాంటి ధృవీకరణ లేని ప్లాట్ఫారమ్లను ఆశ్రయించడం వల్ల ప్రజలు మోసాలకు గురయ్యే ప్రమాదంతో పాటు తప్పుదారి పట్టించే సమాచారాన్ని నమ్మే అవకాశం ఉందని హెచ్చరించారు.
దుబాయ్ జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ రెసిడెన్సీ అండ్ ఫారినర్స్ అఫైర్స్ (GDRFA) జూన్ 17న విడుదల చేసిన ప్రకటనలో, వీసా మరియు రెసిడెన్సీ సేవలకు సంబంధించిన అనధికార ప్రకటనలను గుర్తించి వాటిపై చర్యలు తీసుకున్నట్లు వెల్లడించింది. ప్రజల హక్కులను రక్షించడం, అధికారిక ప్రభుత్వ సేవలపై అవగాహన పెంచడం లక్ష్యంగా ఈ చర్యలు చేపట్టినట్లు పేర్కొంది.
GDRFA డైరెక్టర్ జనరల్ లెఫ్టినెంట్ జనరల్ మహ్మద్ అహ్మద్ అల్ మర్రి మాట్లాడుతూ, నివాసితుల భద్రత మరియు ప్రభుత్వ సేవలపై వారి విశ్వాసాన్ని కాపాడటం సంస్థ ప్రధాన లక్ష్యమని తెలిపారు.
“అనధికార సేవలను ప్రోత్సహించే సంస్థలు, వ్యక్తులపై చర్యలు తీసుకోవడం ద్వారా వినియోగదారుల హక్కులను రక్షించడంతో పాటు అధికారికంగా ఆమోదించబడిన మార్గాల ద్వారానే సేవలు అందేలా చూస్తున్నాం” అని ఆయన పేర్కొన్నారు.
ప్రత్యేక నిఘా బృందాల దర్యాప్తు
వయోలేటర్స్ అండ్ ఫారినర్స్ ఫాలోఅప్ విభాగం అసిస్టెంట్ డైరెక్టర్ జనరల్ మేజర్ జనరల్ డా. అలీ బిన్ అజీఫ్ అల్ జాబీ మాట్లాడుతూ, వీసా సేవలు కోరుకునే వారిని మోసం చేసే కార్యకలాపాలపై ప్రత్యేక బృందాలు నిరంతరం నిఘా ఉంచుతున్నాయని తెలిపారు.
సమాచారం అందిన వెంటనే దర్యాప్తు, ధృవీకరణ ప్రక్రియలు ప్రారంభించి, ఉల్లంఘనల స్వరూపాన్ని గుర్తించి, వాటికి బాధ్యులైన వ్యక్తులు లేదా సంస్థలను గుర్తించిన తర్వాత అవసరమైన చర్యలు తీసుకున్నామని చెప్పారు.
దర్యాప్తులో భాగంగా కొందరు వ్యక్తులు, సంస్థలు డిజిటల్ వేదికల ద్వారా అనధికార వీసా, రెసిడెన్సీ సేవలను ప్రచారం చేస్తున్నట్లు తేలిందన్నారు. ఈ సేవలు ప్రజలను మోసాలకు గురిచేయడంతో పాటు అధికారిక ప్రక్రియలపై తప్పుదారి పట్టించే సమాచారాన్ని అందించే అవకాశం ఉందని పేర్కొన్నారు.
అధికారిక మార్గాలనే వినియోగించాలి
వీసా, రెసిడెన్సీ సేవలను పొందాలనుకునే వారు తప్పనిసరిగా అధికారికంగా గుర్తింపు పొందిన ప్రభుత్వ మార్గాలనే వినియోగించాలని GDRFA సూచించింది. సోషల్ మీడియా లేదా ఇతర డిజిటల్ వేదికల ద్వారా ప్రచారం చేసే అనుమానాస్పద ప్రకటనలు, ఆఫర్లను నమ్మవద్దని హెచ్చరించింది.
వ్యక్తిగత వివరాలు పంచుకునే ముందు, డబ్బులు చెల్లించే ముందు సేవల మూలాలను తప్పనిసరిగా ధృవీకరించాలని అధికారులు సూచించారు. వీసా లేదా రెసిడెన్సీ సేవలకు సంబంధించిన అక్రమ కార్యకలాపాలు గమనించిన వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
ప్రజల్లో అవగాహన పెంపొందించడం ఇలాంటి మోసాలను అరికట్టే తొలి రక్షణ కవచమని అధికారులు స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- పాస్పోర్ట్ సేవల్లో తెలంగాణ పోలీసులకు జాతీయ స్థాయి ప్రతిష్టాత్మక పురస్కారం
- సీఎం చంద్రబాబు నాయుడిని మర్యాదపూర్వకంగా కలిసిన బాబా రామ్దేవ్
- ఇరాన్ కు ఒక్క పైసా కూడా ఇవ్వం అంటూ ట్రంప్ కీలక వ్యాఖ్యలు
- ‘యంగ్ ఇండియా స్టూడెంట్ కిట్’ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్
- విజయవాడలో సరికొత్త ఫుడ్ యాప్ ‘టోయింగ్’ ప్రారంభం
- ప్రపంచ దేశాలకు ఇరాన్ మరో బిగ్ షాక్..
- కోల్కతాలో పారిశ్రామిక వేత్తలతో మంత్రి లోకేశ్ వరుస భేటీలు
- కువైట్ కి రోజువారీ విమాన సర్వీసులు పునఃప్రారంభిస్తున్న ఖతార్ ఎయిర్వేస్
- సోషల్ మీడియాలో అక్రమ వీసా సేవలపై దుబాయ్ అధికారుల కొరడా
- వాహనాల నుంచి చెత్త వేస్తే భారీ జరిమానా







