టాక్స్ పేయర్లు, సామాన్యులకు అలర్ట్..

- June 29, 2026 , by Maagulf
టాక్స్ పేయర్లు, సామాన్యులకు అలర్ట్..

ముంబై: సామాన్యులు, టాక్స్ పేయర్లకు బిగ్ అలర్ట్.. జూలై 1 నుంచి ఆర్థిక పరంగా సరికొత్త రూల్స్ అమల్లోకి రానున్నాయి. ఈ కొత్త రూల్స్ ప్రభావం లక్షలాది భారతీయులపై నేరుగా పడనుంది. అందులో పన్ను చెల్లింపుదారులు, బ్యాంకు ఖాతాదారులు, క్రెడిట్ కార్డ్ హోల్డర్లు, పాస్‌పోర్ట్ దరఖాస్తుదారులు, ఆధార్ యూజర్లు నెల ప్రారంభం నుంచే కొత్త నిబంధనలు, సవరించిన ఛార్జీల భారం మోయాల్సి ఉంటుంది.

రాబోయే మార్పులలో ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు గడువు, ఫ్రీ ఆధార్ ఇమెయిల్ అప్‌డేట్‌, సవరించిన పాస్‌పోర్ట్ ఫీజులు, క్రెడిట్ కార్డ్ రివార్డ్ ప్రోగ్రామ్‌లలో మార్పులు, ఫేక్ సేల్స్ అరికట్టేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త ఫ్రేమ్‌వర్క్ ప్రవేశపెట్టింది. జూలై 1, 2026 నుంచి ఆర్థికపరంగా ఏయే నిబంధనలు మారనున్నాయి? ఏయే రూల్స్ అమల్లోకి రానున్నాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

పన్ను రిటర్న్ డెడ్‌లైన్:
ITR-1 ITR-2 ఫైల్ చేసే వారు ఆర్థిక సంవత్సరం 2025-26 (2026-27 మదింపు సంవత్సరం) తమ ఆదాయపు పన్ను రిటర్న్‌లను 2026 జూలై 31 లోగా సమర్పించాలి. గడువు దాటితే పెనాల్టీలు పడతాయి. తద్వారా పన్ను చెల్లింపుదారులకు కొన్ని పన్ను విధానాలను ఎంచుకోవడం కష్టంగా మారుతుంది.

6 నెలల పాటు ఫ్రీగా ఆధార్ ఇమెయిల్ అప్‌డేట్:
ఆధార్ మొబైల్ అప్లికేషన్ ద్వారా ఆధార్‌కు లింక్ చేసిన రిజిస్టర్డ్ ఇమెయిల్ అడ్రస్ అప్‌డేట్ జూలై 1 నుంచి డిసెంబర్ 31, 2026 వరకు ఫ్రీగా చేసుకోవచ్చు. ఈ మేరకు యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) ప్రకటించింది. గతంలో వినియోగదారులు ఈ సర్వీసు కోసం రూ. 75 చెల్లించాల్సి వచ్చేది.

అధికారిక నోటీసు ప్రకారం..‘ఆధార్ మొబైల్ అప్లికేషన్ ద్వారా ఇమెయిల్ అడ్రస్ అప్ డేట్ సర్వీసు రుసుమును (రూ.75) మాఫీ చేయాలని, జూలై 1, 2026 నుంచి డిసెంబర్ 31, 2026 వరకు 6 నెలల పాటు ఈ సేవను ఫ్రీగా అందించనుంది.’ అని పేర్కొంది.

రివార్డ్ లాంజ్ యాక్సెస్ రూల్స్ మార్పు:
జూలై 1 నుంచి క్రెడిట్ కార్డ్ నిబంధనలు మారనున్నాయి. ఎస్బీఐ కార్డ్, ఫోన్‌ఫే ఎస్బీఐ క్రెడిట్ కార్డ్, పర్పల్ ఫోన్ ఫే ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ సెలెక్ట్ బ్లాక్ కోసం రివార్డ్ పాయింట్ల విధానాన్ని సవరిస్తోంది. ఈ సవరించిన ప్రోగ్రామ్, రివార్డ్ పాయింట్ల సేకరణపై లిమిట్స్ విధించనుంది. ఇకపై రివార్డ్ పాయింట్లకు ఎల్జిబిలిటీ పొందని లావాదేవీల జాబితాను కూడా విస్తరిస్తోంది.

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఉచిత దేశీయ ఎయిర్ పోర్ట్ లాంజ్ యాక్సెస్ కోసం అర్హత నిబంధనలను కఠినతరం చేస్తోంది. గత త్రైమాసికంలో కనీసం రూ. 60వేలు ఖర్చు చేసిన కార్డ్ హోల్డర్‌లకు మాత్రమే ప్రతి క్యాలెండర్ త్రైమాసికంలో 3 ఫ్రీ లాంజ్ విజిట్స్ లభిస్తాయి.

ఉదాహరణకు.. జూలై, సెప్టెంబర్ 2026 మధ్య లాంజ్ బెనిఫిట్స్ పొందాలనుకునే కస్టమర్‌లు ఏప్రిల్, జూన్ 2026 మధ్య రూ.60వేలు లేదా అంతకన్నా ఎక్కువ మొత్తంలో ఖర్చు చేసి ఉండాలి. భవిష్యత్ కొనుగోళ్లలో కూడా ఇంతే మొత్తంలో ఖర్చు చేయాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే లాంజ్ బెనిఫిట్స్ పొందగలరు.

పెరగనున్న పాస్‌పోర్ట్ ఛార్జీలు:
దేశీ, విదేశీ రెగ్యులర్ తత్కాల్ పాస్‌పోర్ట్ సర్వీసు ఛార్జీలు పెరిగాయి. జూలై 1 నుంచి కొత్త ఛార్జీలు అమల్లోకి రానున్నాయి. వచ్చే నెలలో పాస్‌పోర్ట్ దరఖాస్తుదారులు అధిక మొత్తంలో రుసుములను చెల్లించాల్సి ఉంటుంది. పాస్‌పోర్ట్ కోసం దరఖాస్తు లేదా రెన్యువల్ చేసేవారు తమ దరఖాస్తులను సమర్పించే ముందు ఛార్జీలను ఒకసారి చెక్ చేసుకోవడం బెటర్.

ఫేక్ సేల్స్‌పై ఆర్‌బీఐ కొత్త రూల్స్:
బ్యాంకు ఆఫర్లతో ఫేక్ ప్రొడక్టు సేల్స్ నుంచి వినియోగదారులను రక్షించే లక్ష్యంతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) కొత్త నిబంధనలను జూలై 1 నుంచి అమల్లోకి తీసుకురానుంది. కొత్త నిబంధనల ప్రకారం.. తప్పుడు సమాచారంతో అవసరం లేని ప్రొడక్టులను కొనుగోలు చేసిన వినియోగదారులు నష్టపరిహారంతో పాటు, పూర్తి రిఫండ్ పొందవచ్చు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com