చమురు కాలుష్యంపై ఒమన్ హెచ్చరిక..రాస్ మద్రకా తీరంలో 40 కిలోమీటర్లకు విస్తరణ..!!

- August 17, 2026 , by Maagulf
చమురు కాలుష్యంపై ఒమన్ హెచ్చరిక..రాస్ మద్రకా తీరంలో 40 కిలోమీటర్లకు విస్తరణ..!!

మస్కట్: ఒమన్ తీర ప్రాంతంలో చమురు కాలుష్యం ఆందోళనకు గురిచేస్తోంది. హల్లానియాత్ దీవుల సమూహంలోని అల్ ఖిబ్లియాహ్ దీవి సమీపంలో చిక్కుకుపోయిన ఓ నౌక కారణంగా వెలువడిన చమురు, రాస్ మద్రకా ప్రాంతంలో 40 కిలోమీటర్ల వరకు తీరప్రాంతాన్ని ప్రభావితం చేసే అవకాశం ఉందని ఒమన్ పర్యావరణ ప్రాధికార సంస్థ తెలిపింది. కాలుష్య పరిస్థితిని అంచనా వేసేందుకు ప్రత్యేక బృందాలు సంబంధిత అధికారులతో కలిసి పర్యావరణ పర్యవేక్షణ, సర్వే, సహాయక చర్యలను కొనసాగిస్తున్నాయి. తాజా పర్యవేక్షణలో రాస్ మద్రకా ప్రాంతంలోని పలు బీచ్‌లు ఇప్పటికే చమురు కాలుష్యానికి గురైనట్లు గుర్తించారు. ప్రస్తుత అంచనాల ప్రకారం అదే ప్రాంతంలో ప్రభావిత తీరప్రాంతం 40 కిలోమీటర్ల వరకు విస్తరించే అవకాశం ఉంది.

మసీరా ద్వీపానికీ ముప్పు

రానున్న గంటల్లో మసీరా ద్వీపం దక్షిణ తీర ప్రాంతం కూడా ప్రభావితమయ్యే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. అందుబాటులో ఉన్న సమాచారాన్ని బట్టి అక్కడ 10 నుంచి 20 కిలోమీటర్ల మేర తీరప్రాంతం ప్రభావితమయ్యే అవకాశం ఉన్నట్లు తెలిపారు. చమురు కాలుష్యం మరింత విస్తరించకుండా నియంత్రించేందుకు ప్రత్యేక బృందాలు చర్యలు చేపట్టాయి. పర్యావరణపరంగా అత్యంత సున్నితమైన ప్రాంతాలకు ప్రాధాన్యత ఇస్తూ కాలుష్యం వల్ల కలిగే ప్రభావాన్ని అంచనా వేసి, తగ్గించే చర్యలు చేపడుతున్నారు.
రాస్ మద్రకా తదితర ప్రభావిత ప్రాంతాల్లో కనిపించే చమురు లేదా కలుషిత పదార్థాలను తాకవద్దని, చేతితో పట్టుకోవద్దని పర్యావరణ ప్రాధికార సంస్థ ప్రజలను కోరింది. 

మత్స్యకారులు, తీర ప్రాంత సందర్శకులు, స్థానికులు ప్రభావిత ప్రాంతాలకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. కాలుష్యానికి గురైన పదార్థాలు లేదా ప్రాంతాలు కనిపిస్తే వాటిని స్వయంగా శుభ్రం చేయకుండా సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరింది. కలుషిత నీటిలో ఈత కొట్టడం, చమురు పదార్థాలను తాకడం కూడా ప్రమాదకరమని అధికారులు హెచ్చరించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com