ఫుజైరాలో 21 అక్రమ లాబ్ స్టర్ వలలు స్వాధీనం..!!

- August 17, 2026 , by Maagulf
ఫుజైరాలో 21 అక్రమ లాబ్ స్టర్ వలలు స్వాధీనం..!!

ఫుజైరా: సముద్ర పర్యావరణ పరిరక్షణ, స్థిరమైన మత్స్యకార విధానాల అమలులో భాగంగా ఫుజైరా ఎన్విరాన్‌మెంట్ అథారిటీ (FEA) చేపట్టిన ప్రత్యేక తనిఖీల్లో 21 అక్రమ లాబ్ స్టర్ వలలను స్వాధీనం చేసుకుంది. ఈ చర్యలో అంతరించిపోయే ప్రమాదంలో ఉన్న పలు చేపలను కూడా అధికారులు రక్షించి తిరిగి సముద్రంలోకి వదిలారు. దిబ్బా సముద్ర ప్రాంతంలో, సముద్ర రక్షిత ప్రాంతాలకు సమీపంలోని మూడు నాటికల్ మైళ్ల పరిధిలో ఈ తనిఖీలు నిర్వహించారు.

రక్షిత ప్రాంతాల సరిహద్దుల వద్ద, అలాగే కొన్ని వలలు రక్షిత ప్రాంతాల లోపల కూడా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. స్వాధీనం చేసుకున్న అక్రమ వలలను నిబంధనల ప్రకారం దిబ్బా ఫుజైరా మత్స్యకారుల సంఘానికి అప్పగించారు. సముద్ర రక్షిత ప్రాంతాల్లో అక్రమ మత్స్యకారాన్ని అరికట్టేందుకు ఫుజైరా అధికారులు నిరంతర తనిఖీలు నిర్వహిస్తున్నారు. గత నవంబర్‌లో బర్డ్ ఐలాండ్ రిజర్వ్‌లో అక్రమంగా చేపలు పట్టిన ఆరు ఫిషింగ్ బోట్లను అధికారులు స్వాధీనం చేసుకుని, సంబంధిత అధికారులతో కలిసి చట్టపరమైన చర్యలు చేపట్టారు.

24 గంటల పర్యవేక్షణ

సముద్ర జీవ వైవిధ్యాన్ని కాపాడేందుకు, చేపల నిల్వలను స్థిరంగా కొనసాగించేందుకు, అక్రమ మత్స్యకారాన్ని అరికట్టేందుకు 24 గంటలూ పర్యవేక్షణ చర్యలు కొనసాగుతున్నాయని FEA తెలిపింది. రోజువారీ పర్యవేక్షణ, ముందస్తు ప్రణాళికతో నిర్వహించే ఫీల్డ్ తనిఖీలు, ఆధునిక నిఘా సాంకేతికతలను ఉపయోగించి అక్రమ కార్యకలాపాలను తొలిదశలోనే గుర్తిస్తున్నట్లు అధికారులు తెలిపారు.రక్షిత సముద్ర ప్రాంతాల్లో చేపలు పట్టడం తీవ్రమైన పర్యావరణ ఉల్లంఘన అని, దీనికి చట్టపరమైన చర్యలు తప్పవని FEA డైరెక్టర్ అసీలా అల్ మౌల్లా హెచ్చరించారు. సముద్ర రక్షిత ప్రాంతాలు పగడపు దిబ్బలు, చిన్న చేపలు, అరుదైన మరియు అంతరించిపోతున్న సముద్ర జీవులకు కీలకమైన ఆవాసాలను అందిస్తాయని అధికారులు తెలిపారు.

అక్రమంగా లేదా నియంత్రణ లేకుండా చేపలు పట్టడం వల్ల ఆహార గొలుసులు దెబ్బతినడంతో పాటు చేపల నిల్వలు తగ్గి, సముద్ర జీవులకు సహజ రక్షణగా ఉండే పగడపు నిర్మాణాలు కూడా దెబ్బతింటాయని వివరించారు. డైవింగ్ ప్రాంతాలకు సమీపంలో చేపలు పట్టడం వల్ల మత్స్యకారుల వలల్లో డైవర్లు చిక్కుకునే ప్రమాదం, వేగంగా వెళ్లే పడవలతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. దీంతో మానవ భద్రతతో పాటు సముద్ర పర్యావరణానికి కూడా ముప్పు ఏర్పడుతుందని తెలిపారు.

చేపలు సురక్షిత ప్రాంతాల్లో పెరిగి, పునరుత్పత్తి చేసుకునే అవకాశం కల్పించడం ద్వారా సముద్ర పర్యావరణ సమతుల్యతను కాపాడటంతో పాటు భవిష్యత్ ఆహార భద్రతకు కూడా ఇది దోహదపడుతుందని FEA తెలిపింది. ఇలాంటి చర్యలు పర్యావరణ పర్యాటకం, స్థిరమైన డైవింగ్ వంటి కార్యకలాపాలను ప్రోత్సహించడం ద్వారా బ్లూ ఎకానమీ అభివృద్ధికి కూడా సహకరిస్తాయని అధికారులు పేర్కొన్నారు. పర్యావరణ ఉల్లంఘనలు కనిపిస్తే ప్రజలు, మత్స్యకారులు 800368 నంబర్‌కు సమాచారం ఇవ్వాలని FEA కోరింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com