సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో పదవీ విరమణ పొందిన పోలీసు అధికారులు

- June 30, 2026 , by Maagulf
సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో పదవీ విరమణ పొందిన పోలీసు అధికారులు

సైబరాబాద్: సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయo  ఆడిటోరియంలో ఈ రోజు 14 మంది పదవీ విరమణ పొందిన పోలీసు అధికారులు, సిబ్బందికి పదవీ విరమణ కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో సీఐ సెల్‌లో సేవలందించిన ఎస్‌ఐ జాకీర్ హుస్సేన్, సీటీసీలో పనిచేసిన ఎస్‌ఐ వెంకట్ రెడ్డి, షాబాద్ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహించిన ఎస్‌ఐ శంకర్ రెడ్డి, సనత్‌నగర్ పోలీస్ స్టేషన్‌కు చెందిన ఎస్‌ఐ నాగరాజులు, పీసీఆర్‌కు చెందిన ఎస్‌ఐ షేక్ షబుద్దీన్, రామచంద్రాపురం పోలీస్ స్టేషన్‌లో పనిచేసిన ఎస్‌ఐ నారాయణ గౌడ్, షీ టీమ్స్‌లో సేవలందించిన ఎస్‌ఐ శ్రీనివాస్, ఆమనగల్ పోలీస్ స్టేషన్‌లో పనిచేసిన ఎస్‌ఐ సీతారాం రెడ్డి పదవీ విరమణ పొందారు.

వీరితో పాటు ఆమనగల్ పోలీస్ స్టేషన్‌కు చెందిన ఏఎస్‌ఐ ఎస్.మురళీధర్, మాదాపూర్ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహించిన ఏఎస్‌ఐ మాణిక్ రెడ్డి, సీఏఆర్ హెడ్‌క్వార్టర్స్‌కు చెందిన ఏఆర్‌ఎస్‌ఐ సుబ్బరాయుడు, సీఏఆర్ హెడ్‌క్వార్టర్స్‌లో పనిచేసిన ఏఆర్‌ఎస్‌ఐ మాణిక్ రెడ్డి, పీసీఆర్ సైబరాబాద్‌లో సేవలందించిన పీసీ ఎ.లక్ష్మణ్ నాయక్, నార్సింగి పోలీస్ స్టేషన్‌కు చెందిన హెచ్.జి.ఎం.నగేష్, సగర్వంగా పదవీ విరమణ చేశారు.

ఈ సందర్భంగా సైబరాబాద్ సీపీ డాక్టర్ ఎం.రమేష్ మాట్లాడుతూ, పదవీ విరమణ పొందుతున్న తన సహచర పోలీసు అధికారులు, సిబ్బందికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. పోలీస్ శాఖలో సుదీర్ఘ కాలం పాటు సేవలందించిన ప్రతి ఒక్కరికీ ఎన్నో అనుభవాలు, మధుర జ్ఞాపకాలు ఉంటాయని అన్నారు. జీవితంలో సగానికి పైగా కాలాన్ని పోలీస్ శాఖకు అంకితం చేస్తూ, కుటుంబం కంటే విధులకే అధిక ప్రాధాన్యం ఇచ్చి ప్రజల భద్రత కోసం అహర్నిశలు కృషి చేశారని కొనియాడారు.

పోలీస్ కుటుంబ సభ్యులు కూడా ఎంతో క్రమశిక్షణతో, సహనంతో పోలీసు ఉద్యోగుల సేవలకు అండగా నిలిచారని, వారి త్యాగం కూడా అభినందనీయమని పేర్కొన్నారు. పదవీ విరమణ పొందుతున్న అధికారులు, సిబ్బంది ఆయురారోగ్యాలతో, ఆనందంగా, కుటుంబ సభ్యులతో సుఖసంతోషాలతో విశ్రాంతి జీవితాన్ని గడపాలని ఆకాంక్షించారు. అలాగే, అవసరమైన సందర్భాల్లో పదవీ విరమణ పొందిన పోలీసు అధికారులు, సిబ్బంది తమ అనుభవాలను, సేవలను పోలీస్ శాఖతో పంచుకుంటూ శాఖ అభివృద్ధికి తోడ్పడాలని సూచించారు. అనంతరం పదవీ విరమణ పొందిన అధికారులు, సిబ్బందిని ఘనంగా సత్కరించి జ్ఞాపికలతో పాటు వారి పెన్షన్ పత్రాలను అందజేశారు.

ఈ కార్యక్రమంలో అడ్మిన్ డీసీపీ టి.అన్నపూర్ణ, ఎస్.బీ డీసీపీ సుధీంద్ర, క్రైమ్స్ డీసీపీ ముత్యం రెడ్డి, సీఏఆర్ హెడ్ క్వార్టర్స్ డీసీపీ సంజీవ్, ఏడీసీపీలు, ఏసీపీలు ఇతర పోలీసు సిబ్బంది  పాల్గొని పదవీ విరమణ పొందిన సహచరులకు శుభాకాంక్షలు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com