ఆంధ్రప్రదేశ్‌లో పట్టణ ఆరోగ్య కేంద్రాల నిర్వహణ అపోలో చేతికి

- August 12, 2016 , by Maagulf
ఆంధ్రప్రదేశ్‌లో పట్టణ ఆరోగ్య కేంద్రాల నిర్వహణ అపోలో చేతికి

 ఆంధ్రప్రదేశ్‌లో పట్టణ ఆరోగ్య కేంద్రాల నిర్వహణ అపోలో హాస్పిటల్స్‌ చేపట్టనుంది. కోస్తాలో కీలకమైన ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు సహా 9 జిల్లాల్లోని పట్టణ ఆరోగ్య కేంద్రాల నిర్వహణను అపోలో హాస్పిటల్స్‌ ప్రైవేటు లిమిటెడ్‌కు అప్పగిస్తూ ఏపీ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకొంది. మూడేళ్ల పాటు ఆరోగ్య కేంద్రాల నిర్వహణను అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేశారు. దేశీయ కార్పొరేట్‌ వైద్య రంగంలో చక్కటి పేరున్న అపోలో గ్రూపు ఆసుపత్రుల నిర్వహణ బాధ్యతలు దక్కించుకోవడంతో పేద రోగులకు అర్బన్‌ హెల్త్‌ సెంటర్ల ద్వారా ఉచితంగా కార్పొరేట్‌ వైద్యం లభిస్తుందని భావిస్తున్నారు. విశాఖ, విజయనగరం సహా నాలుగు జిల్లాల్లో ఆరోగ్య కేంద్రాల నిర్వహణను ధనుష్‌ ఎంటర్‌ప్రైజెస్‌ అనే సంస్థకు అప్పగించినట్లు సమాచారం. సెప్టెంబర్‌ నుంచి ఈ రెండు సంస్థలు నిర్వహణ బాధ్యతలను స్వీకరించే అవకాశం ఉంది.ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో (పీపీపీ పద్దతి) ఆరోగ్య కే ంద్రాల ద్వారా పట్టణ ప్రాంత వాసులకు మెరుగైన వైద్యసేవలు అందించే క్రమంలో ఈ రెండు సంస్థలకు నిర్వహణ బాధ్యతలను అప్పగించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అపోలో హాస్పిటల్స్‌కు చెందిన డాక్టర్‌ రమేశ్‌ నేతృత్వంలోని ప్రతినిధి బృందం తమకు అప్పగించిన జిల్లాల్లో ఆరోగ్య కేంద్రాలను పరిశీలించారు. భవనాలకు మరమ్మతులు, కొనుగోలు చేయాల్సిన వైద్య పరికరాలపై ఒక నిర్ణయానికి వచ్చారు. వీటిపై ప్రాథమిక నివేదికను రూపొందించారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో పని చేస్తున్న సిబ్బందిని తొలగించబోమని, వారిని యఽథావిఽఽధిగా కొనసాగిస్తామని వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు తెలిపారు.ఆరోగ్య కేంద్రాల పేరు మార్పు..నిర్వహణ బాధ్యతలతో పాటు పట్టణ ఆరోగ్య కేంద్రాల రూపు రేఖలు మారనున్నాయి. ఇప్పటి వరకు పట్టణ ఆరోగ్య కేంద్రాలు (అర్బన్‌ హెల్త్‌ సెంటర్స్‌)గా వీటిని పిలుస్తున్నారు. ఇకపై ఈ కేంద్రాలను ఈ-పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (ఈ- అర్బన్‌ ప్రైమరీ హెల్త్‌ సెంటర్స్‌)గా పిలుస్తారు. జాతీయ పట్టణ ఆరోగ్య పథకం (ఎన్‌యూహెచ్‌ఎం) నుంచి వీటి నిర్వహణకు కేంద్రం నిధులు అందజేస్తుంది. పట్టణ ప్రాంతాల్లో సరైన వైద్య సేవలు అందడం లేదనే ఆలోచనతో 15 ఏళ్ల కింద పట్టణ ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటి నిర్వహణను స్వచ్ఛంద సంస్థలకు అప్పగించారు. తొలినాళ్లలో బాగానే సేవలు అందించినా తర్వాత నిరాశాజనకంగా మారాయి. దీంతో వీటి సంస్కరణపై కేంద్రం దృష్టి సారించింది.పెరగనున్న వైద్య సిబ్బంది.. పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో ఇప్పటిదాకా మెడికల్‌ ఆఫీసర్‌, కో-ఆర్డినేటర్‌, ఇద్దరు ఆరోగ్య కార్యకర్తలు, వైద్య సహాయకుడు, వాచ్‌మన్‌, స్వీపర్‌ పోస్టులు మాత్రమే ఉండేవి. ఇప్పుడు డాక్టర్ల సంఖ్య పెంచాలని అపోలో హాస్పిటల్స్‌ నిర్ణయించింది. ఒక రెగ్యులర్‌ మెడికల్‌ ఆఫీసర్‌తో పాటు పార్ట్‌టైమ్‌గా స్పెషలిస్ట్‌ డాక్టర్‌ను నియమిస్తారు. ఇదేరీతిలో స్టాఫ్‌నర్సులను, ల్యాబ్‌ టెక్నీషియన్‌, ఫార్మసిస్టును నియమించాలని తీర్మానించారు. డేటా ఎంట్రీ ఆపరేటర్‌నూ నియమిస్తారు. 'ప్రస్తుతం ఆయా ఆరోగ్య కేంద్రాల్లో మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి సారించాం. అదనపు వైద్య సిబ్బంది నియామకానికి కొంత సమయం పడుతుంది' అని అపోలో హాస్పిటల్స్‌ ప్రతినిధి ఒకరు  తెలిపారు.

  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com