అలులాలో ఏటా 1.30 లక్షల టన్నుల ఖర్జూరాల ఉత్పత్తి..!!
- July 12, 2026
అలులా: సౌదీ అరేబియాలోని చారిత్రక నగరం అలులా(ALULA)లో 2026–2027 'ఖైరాత్ అలులా' వ్యవసాయ సీజన్ ను రాయల్ కమిషన్ ఫర్ అలులా (RCU) ఘనంగా ప్రారంభించింది. వ్యవసాయ రంగ పోటీతత్వాన్ని పెంచడం, ఉత్పాదకతను మెరుగుపరచడం, రైతులను సాధికారత కల్పించడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని అధికారులు తెలిపారు. అలులాలో ప్రస్తుతం 20,500 హెక్టార్లకు పైగా సాగుభూమి ఉంది. ఇక్కడ ప్రతి సంవత్సరం సుమారు 1.30 లక్షల టన్నుల ఖర్జూరాలు, 14 వేల టన్నుల సిట్రస్ పండ్లు ఉత్పత్తి అవుతున్నాయి. ఈ ప్రాంతంలో 4 లక్షలకు పైగా సిట్రస్ చెట్లు ఉన్నాయి.
అలులా ఒయాసిస్లోని 4.2 మిలియన్లకు పైగా ఖర్జూర చెట్లను సర్వే చేసి నమోదు చేయగా, 1.5 మిలియన్లకు పైగా చెట్లను స్మార్ట్ QR కోడ్ ట్రేసబిలిటీ వ్యవస్థలో చేర్చారు. దీని ద్వారా ఉత్పత్తుల నాణ్యతను మెరుగుపరచడంతో పాటు దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలో విక్రయ అవకాశాలు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 2035 నాటికి వ్యవసాయ రంగ స్థూల ఉత్పత్తి విలువను 1.8 బిలియన్ సౌదీ రియాల్స్కు, ఖర్జూరాల అమ్మకాల విలువను 1.507 బిలియన్ రియాల్స్కు పెంచాలని రాయల్ కమిషన్ లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో 1.226 బిలియన్ రియాల్స్ విలువైన ఎగుమతులు ఉండేలా ప్రణాళికలు రూపొందించింది.
అలాగే, 7,100 మందికి పైగా రైతులకు సాంకేతిక, వ్యవసాయ, పశువైద్య సేవలు అందించడంతో పాటు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తోంది.
అలాగే వ్యవసాయ వ్యర్థాలను రీసైక్లింగ్ చేసి 3.34 లక్షల క్యూబిక్ మీటర్ల సేంద్రియ ఎరువును తయారు చేస్తోంది. నీటి వినియోగాన్ని 2035 నాటికి 47 శాతం తగ్గించే లక్ష్యంతో ఆధునిక సాగునీటి వ్యవస్థలు, పర్యవేక్షణ సాంకేతికతలను 4,000 హెక్టార్లకు పైగా విస్తరించేందుకు చర్యలు చేపట్టింది. 'ఖైరాత్ అలులా' వ్యవసాయ సీజన్ ద్వారా స్థానిక పంటలు, పండ్లను పర్యాటకులకు పరిచయం చేయడంతో పాటు రైతులు, స్వయం ఉపాధి అవకాశాలు, వ్యాపారవేత్తలు, పెట్టుబడిదారులకు మార్కెటింగ్ అవకాశాలు కల్పిస్తూ అలులాను సుస్థిర వ్యవసాయ–పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా అధికారులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







