యూఏఈ క్షిపణులు, డ్రోన్ల ముప్పును సమర్థంగా ఎదుర్కొంది

- July 12, 2026 , by Maagulf
యూఏఈ క్షిపణులు, డ్రోన్ల ముప్పును సమర్థంగా ఎదుర్కొంది

అబుదాబి: యూఏఈలో ఆదివారం తెల్లవారుజామున క్షిపణులు, డ్రోన్ల ముప్పు నేపథ్యంలో వైమానిక రక్షణ వ్యవస్థలు అప్రమత్తమై వాటిని అడ్డుకునే చర్యలు చేపట్టాయి. ఈ మేరకు యూఏఈ రక్షణ మంత్రిత్వ శాఖ (MoD) దేశవ్యాప్తంగా అత్యవసర హెచ్చరిక జారీ చేసి ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

ఉదయం 6.37 గంటలకు విడుదల చేసిన ప్రకటనలో, దేశంలోని పలు ప్రాంతాల్లో వినిపించిన భారీ శబ్దాలు వైమానిక రక్షణ వ్యవస్థలు క్షిపణులు, డ్రోన్లను అడ్డుకుంటున్న సమయంలో సంభవించినవేనని వెల్లడించింది. ప్రజలు ఎలాంటి ఆందోళనకు గురికాకుండా అధికారుల సూచనలను తప్పనిసరిగా పాటించాలని కోరింది.

అలాగే అడ్డుకున్న క్షిపణులు లేదా డ్రోన్ల శకలాలు ఎక్కడైనా కనిపిస్తే వాటి వద్దకు వెళ్లరాదని, వాటిని తాకరాదని లేదా ఫొటోలు తీయరాదని హెచ్చరించింది. అలాంటి ఘటనలు కనిపించిన వెంటనే 999కు ఫోన్ చేసి సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని సూచించింది.

ఈ ఏడాది మే 4 తర్వాత యూఏఈలో వైమానిక ముప్పు నేపథ్యంలో దేశవ్యాప్తంగా అత్యవసర హెచ్చరిక జారీ కావడం ఇదే తొలిసారి. మే 4న కూడా ఇలాంటి పరిస్థితుల్లో వైమానిక రక్షణ వ్యవస్థలు స్పందించగా, ఆ తర్వాత 69 రోజుల అనంతరం మరోసారి అత్యవసర హెచ్చరిక వెలువడింది.

కాగా, జూన్ 26న కూడా కొందరు నివాసితులకు అత్యవసర అలర్ట్ అందినప్పటికీ, అది సాంకేతిక లోపం కారణంగా జరిగినదేనని, ఎలాంటి భద్రతా ముప్పుతో సంబంధం లేదని అధికారులు అప్పట్లో స్పష్టం చేశారు.

ఇదిలా ఉండగా, గల్ఫ్ ప్రాంతంలోని ఖతార్ మరియు బహ్రెయిన్ దేశాల్లో కూడా ఆదివారం ఉదయం క్షిపణులు, డ్రోన్ల ముప్పు నేపథ్యంలో వైమానిక రక్షణ వ్యవస్థలు స్పందించాయి. ఆయా దేశాల్లో సైరన్లు మోగించి ప్రజలను అప్రమత్తం చేసినట్లు అధికారులు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com