తెలంగాణకే 3 బులెట్ ట్రైన్స్: కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్

- July 11, 2026 , by Maagulf
తెలంగాణకే 3 బులెట్ ట్రైన్స్: కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్

న్యూ ఢిల్లీ: భారతదేశ రవాణా రంగాన్ని విప్లవాత్మకంగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న హైస్పీడ్ రైల్ కారిడార్లలో తెలంగాణకు సింహభాగం దక్కింది. దేశవ్యాప్తంగా మొత్తం 7 బులెట్ రైలు (Bullet Train) ప్రాజెక్టులను ప్రతిపాదించగా, అందులో ఏకంగా 3 రూట్లు తెలంగాణ మీదుగానే వెళ్లనున్నట్లు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన ఈ కీలక విషయాలను పంచుకున్నారు. ఈ బులెట్ రైళ్లు అందుబాటులోకి వస్తే హైదరాబాద్ నగరం నుండి దేశంలోని ప్రధాన మెట్రో నగరాలకు ప్రయాణ సమయం ఊహించని విధంగా తగ్గిపోనుంది. ఈ సరికొత్త రవాణా వ్యవస్థ ద్వారా హైదరాబాద్ నుండి బెంగళూరుకు కేవలం 2 గంటల 35 నిమిషాల్లో, ముంబైకి 2 గంటల 20 నిమిషాల్లో, పుణేకు కేవలం 2 గంటల్లో మరియు విజయవాడకు కేవలం 70 నిమిషాల్లోనే చేరుకోవచ్చని కేంద్రమంత్రి వివరించారు.

సాఫ్ట్‌వేర్ నుండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వైపు ఐటీ రంగం అడుగులు వేయాలి: అశ్విని వైష్ణవ్

ఇదే వేదిక పై నుంచి దేశీయ ఐటీ రంగ దిశానిర్దేశంపై కూడా కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ సాంకేతిక రంగానికి ఒక గ్లోబల్ హబ్‌గా ఎదిగిందని కొనియాడిన ఆయన, మారుతున్న కాలానికి అనుగుణంగా ఇక్కడి కంపెనీలు అప్‌గ్రేడ్ అవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఇప్పటివరకు ఐటీ రంగం కేవలం ‘సాఫ్ట్‌వేర్ యాజ్ ఎ సర్వీస్’ (SaaS – Software as a Service) మోడల్‌పైనే ఎక్కువగా ఆధారపడిందని, అయితే భవిష్యత్తు అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) దేనని స్పష్టం చేశారు. ఐటీ కంపెనీలు, స్టార్టప్‌లు ఏఐ వైపు వేగంగా అడుగులు వేసి సరికొత్త ఆవిష్కరణలకు తెరలేపాలని, అప్పుడే ప్రపంచ మార్కెట్లో భారతీయ సాంకేతిక రంగం అగ్రస్థానంలో కొనసాగుతుందని ఆయన పిలుపునిచ్చారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com