హోర్ముజ్ జలసంధిలో యూఏఈకి చెందిన రెండు ట్యాంకర్ల పై క్షిపణి దాడి..

- July 14, 2026 , by Maagulf
హోర్ముజ్ జలసంధిలో యూఏఈకి చెందిన రెండు ట్యాంకర్ల పై క్షిపణి దాడి..

అబుదాబి: హోర్ముజ్ జలసంధి దక్షిణ మార్గంలో ఒమాన్ ప్రాదేశిక జలాల్లో ప్రయాణిస్తున్న యూఏఈకి చెందిన జాతీయ చమురు ట్యాంకర్లు మొంబాసా మరియు అల్ బహియాహ్పై ఇరాన్‌కు చెందిన రెండు క్రూయిజ్ క్షిపణులతో దాడి జరిగినట్లు యూఏఈ రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

ఈ దాడిలో మొంబాసా ట్యాంకర్‌లో విధులు నిర్వహిస్తున్న ఒక భారతీయ సిబ్బంది మరణించగా, మరో ఎనిమిది మంది గాయపడ్డారు. గాయపడిన వారిలో ఆరుగురు భారతీయులు, ఇద్దరు ఉక్రెయిన్ పౌరులు ఉన్నారని, వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది.

క్షిపణి దాడి కారణంగా రెండు ట్యాంకర్లలోనూ మంటలు చెలరేగి గణనీయమైన ఆస్తి నష్టం సంభవించింది. అయితే, అత్యవసర సహాయక చర్యలతో రెండు నౌకల్లోని మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకువచ్చినట్లు అధికారులు వెల్లడించారు.

ఈ ఘటన పై యూఏఈ రక్షణ మంత్రిత్వ శాఖ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ, దేశ భద్రత, ప్రజలు మరియు నివాసితుల రక్షణ కోసం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. ఈ దాడితో ఏర్పడిన పరిస్థితులకు తగిన విధంగా స్పందించే పూర్తి హక్కు యూఏఈకి ఉందని తన ప్రకటనలో పేర్కొంది.

ప్రపంచంలోని అత్యంత కీలక సముద్ర వాణిజ్య మార్గాల్లో ఒకటైన హోర్ముజ్ జలసంధిలో ఈ ఘటన చోటుచేసుకోవడంతో ప్రాంతీయ ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com