ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..

- July 22, 2026 , by Maagulf
ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..

న్యూ ఢిల్లీ: నీట్‌ పేపర్ లీక్ వ్యవహారంలో ఆందోళనలు చేస్తున్న కాక్రోచ్‌ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వంతో చర్చలకు సంబంధించి సంచలన నిర్ణయం తీసుకుంది. తాము ప్రభుత్వ వద్దకు వెళ్లేది లేదని, కేంద్ర మంత్రి జేపీ నడ్డా స్వయంగా జంతర్‌ మంతర్‌కే వచ్చి చర్చలు జరపాలని సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్‌ దీప్కే స్పష్టం చేశారు. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేయాలన్న ప్రధాన డిమాండ్‌తో పాటు తమ ఇతర షరతులకు అంగీకరిస్తేనే చర్చల ప్రక్రియ ముందుకు సాగుతుందని, అప్పటివరకు వెనక్కి తగ్గేదే లేదని హెచ్చరించారు.

ఇదిలా ఉంటే, ప్రస్తుతం దేశరాజధాని ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇటీవల సీజేపీ చేపట్టిన ‘సంసద్ మార్చ్(Neet Protest)’ వేళ పోలీసులు బలప్రయోగం చేసి లాఠీచార్జ్ చేయడంతో పరిస్థితి చేయిదాటింది. పోలీసులు నిబంధనల పేరుతో విరుచుకుపడ్డారని నిరసనకారులు మండిపడుతుండగా, శాంతిభద్రతల దృష్ట్యా జంతర్ మంతర్ వద్ద పోలీసులు 163వ సెక్షన్ అమలు చేసి భారీగా బారికేడ్లు ఏర్పాటు చేశారు. దేశనలుమూలల నుంచి వేలాదిమంది విద్యార్థులు, మద్దతుదారులు ఢిల్లీకి చేరుకోవడంతో వీధులన్నీ నిరసనకారులతో నిండిపోయాయి.

అటు ప్రతిపక్షాలు కూడా ఈ పోరాటానికి మద్దతు ప్రకటించడంతో ఢిల్లీ వేదికగా రాజకీయం పరాకాష్టకు చేరింది. విద్యార్థులు శాంతియుతంగా వస్తే మాట్లాడేందుకు సిద్ధమని కేంద్రం ప్రకటిస్తున్నప్పటికీ, “నడ్డానే జంతర్ మంతర్‌కు రావాలి” అన్న సీజేపీ డిమాండ్‌తో చర్చల ప్రక్రియలో డెడ్‌లాక్ ఏర్పడింది. గతంలో జరిగిన మొదటి విడత భేటీలో సమయం వృథా చేశారని ఆరోపిస్తున్న సీజేపీ నేతలు, తమ డిమాండ్లు నెరవేరే వరకు కదిలేది లేదని తెగేసి చెప్తున్నారు. దీంతో కేంద్ర ప్రభుత్వం ఈ సమస్యను ఎలా పరిష్కరిస్తుందనేది తీవ్ర ఆసక్తికరంగా మారింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com