దుబాయ్‌లో రోడ్డు భద్రతపై షార్ట్ ఫిల్మ్ తీస్తే రూ.6 లక్షలకుపైగా బహుమతి..!!

- August 19, 2026 , by Maagulf
దుబాయ్‌లో రోడ్డు భద్రతపై షార్ట్ ఫిల్మ్ తీస్తే రూ.6 లక్షలకుపైగా బహుమతి..!!

దుబాయ్: రోడ్డు భద్రతపై అవగాహన కల్పించే షార్ట్ ఫిల్మ్‌లు రూపొందించే వారికి దుబాయ్ రోడ్స్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ (RTA) భారీ నగదు బహుమతులు ప్రకటించింది. దుబాయ్ నివాసితులు, యూనివర్సిటీ విద్యార్థులు, కుటుంబాలు ఈ పోటీలో పాల్గొని Dh30,000 వరకు గెలుచుకోవచ్చు. RTA ఆధ్వర్యంలో రెండో ఎడిషన్ రోడ్ సేఫ్టీ ఫిల్మ్ ఫెస్టివల్ ప్రారంభమైంది. వేగంగా వాహనాలు నడపడం, డ్రైవింగ్ సమయంలో మొబైల్ ఫోన్ ఉపయోగించడం, సీట్‌బెల్ట్ పెట్టుకోకపోవడం వంటి ప్రమాదకర అలవాట్లపై అవగాహన కల్పించేలా షార్ట్ ఫిల్మ్‌లు రూపొందించవచ్చు. ఆగస్టు 24 నుంచి నవంబర్ 22 వరకు RTA వెబ్‌సైట్ ద్వారా ఎంట్రీలను స్వీకరించనున్నారు.

విజేతలకు భారీ నగదు బహుమతులు

వ్యక్తులు, యూనివర్సిటీ విద్యార్థుల కోసం రెండు ప్రధాన విభాగాలు ఉన్నాయి. సురక్షిత డ్రైవింగ్‌పై ఉత్తమ అవగాహన ఫిల్మ్, ఆధునిక సాంకేతికతను ఉపయోగించి రూపొందించిన ఉత్తమ వినూత్న రోడ్డు భద్రతా ఫిల్మ్ ఇందులో ఉన్నాయి.
ప్రతి విభాగంలో ప్రథమ బహుమతి: Dh30,000, ద్వితీయ బహుమతి: Dh20,000, తృతీయ బహుమతి: Dh10,000 అందిజేస్తారు. ఈ ఏడాది కుటుంబ రోడ్డు భద్రతా ఫిల్మ్ విభాగాన్ని కూడా కొత్తగా ప్రవేశపెట్టారు. దీనికి కూడా ఇదే స్థాయిలో నగదు బహుమతులు ఉంటాయని ప్రకటించారు.

ప్రమాద బాధితుల నిజ జీవిత కథలకూ అవకాశం

ట్రాఫిక్ ప్రమాద బాధితుల నిజ జీవిత కథలను ఆధారంగా చేసుకుని రూపొందించే ఫిల్మ్ లకు ప్రత్యేక కమ్యూనిటీ విభాగం ఉంటుంది. రోడ్డు ప్రమాదాల వల్ల కుటుంబాలు ఎదుర్కొనే మానవీయ విషాదాన్ని చూపించి, వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించేలా ప్రేరేపించే ఫిల్మ్ లకు ఇందులో ప్రాధాన్యం ఇస్తారు. ఈ విభాగంలోనూ విజేతలకు Dh30,000, Dh20,000, Dh10,000 చొప్పున బహుమతులు అందిస్తారు. ప్రభుత్వ సంస్థలు, ప్రైవేట్ కంపెనీలకు నగదు బహుమతులకు బదులుగా గుర్తింపు ట్రోఫీలు అందించనున్నారు. అన్ని విభాగాలను కలిపి మొత్తం Dh240,000 నగదు బహుమతులు, బహుమతులు మరియు ఇతర గుర్తింపుల విలువ కలిపి Dh300,000 వరకు ఉంటుందని RTA తెలిపింది.

విజేతల ఫిల్మ్ లకు మరింత ప్రచారం

పోటీలో గెలిచిన ఫిల్ములను RTA తన రోడ్డు భద్రతా ప్రచారాలు, అవగాహన కార్యక్రమాలు, వర్క్‌షాప్‌లు, డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో ఉపయోగించనుంది. దీంతో విజేతల ఫిల్మ్ పెద్ద సంఖ్యలో ప్రజలకు చేరుకునే అవకాశం ఉంటుంది. RTA ట్రాఫిక్ అండ్ రోడ్స్ ఏజెన్సీ సీఈఓ హుస్సేన్ అల్ బన్నా మాట్లాడుతూ.. సోషల్ మీడియా, డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ల విస్తరణ కారణంగా రోడ్డు భద్రతా సందేశాలను ప్రజలకు చేరవేయడంలో షార్ట్ ఫిల్మ్‌లు సమర్థవంతమైన మార్గంగా మారాయని తెలిపారు. 2025లో జరిగిన తొలి ఎడిషన్‌కు 100కు పైగా ఎంట్రీలు వచ్చాయి. దుబాయ్ రోడ్లపై మరణాలు, తీవ్రమైన గాయాలను తగ్గించాలనే RTA ‘Zero Fatalities’ లక్ష్యంలో భాగంగానే ఈ పోటీని నిర్వహిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com