అమెరికాకు అండగా నిలిస్తే శత్రువులుగా పరిగణిస్తాం..ఇరాన్ హెచ్చరిక

- August 23, 2026 , by Maagulf
అమెరికాకు అండగా నిలిస్తే శత్రువులుగా పరిగణిస్తాం..ఇరాన్ హెచ్చరిక

అమెరికా: అమెరికా అనుసరిస్తున్న ఆర్థిక విధానాలు, ఆంక్షలపై ఇరాన్ తీవ్రస్థ స్పందించింది. అమెరికా సాగిస్తున్న ఆర్థిక యుద్ధంలో ఏ దేశమైనా భాగస్వామ్యం అయితే, వాటిని తమ ప్రత్యర్థులుగానే చూస్తామని స్పష్టం చేసింది. ఇరాన్‌ను ఒంటరిగా చేసేందుకు యత్నించే దేశాల ప్రయోజనాలపై దాడులు చేస్తామని, ముఖ్యంగా పొరుగు దేశాలు ఈ దిగ్బంధనంలో చేరితే హర్మూజ్ జలసంధి గుండా చమురు రవాటాను పూర్తిగా నిలిపివేస్తామని, ఒక్క చుక్క నూనె కూడా బయటకు వెళ్లకుండా అడ్డుకుంటామని హెచ్చరించింది.

మొహ్సెన్ రెజాయీ ప్రకటన: చర్చలకే తొలి ప్రాధాన్యం                                                        ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటరీ మొహ్సెన్ రెజాయీ ఓ జాతీయ మీడియా ఇంటర్వ్యూలో ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముందుగా అమెరికాకు సహకరించే దేశాలతో సంప్రదింపులు జరిపి, ఈ వివాదానికి దూరంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తామని ఆయన తెలిపారు. ఒకవేళ ఆ దేశాలు తమ హెచ్చరికలను బేఖాతరు చేస్తే, వాటి ఆర్థిక ప్రయోజనాలే లక్ష్యంగా దాడులు చేయక తప్పదని హెచ్చరించారు. ఏళ్ల తరబడి అమెరికా ఆంక్షలను సమర్థవంతంగా ఎదుర్కొన్న అనుభవం తమకు ఉందని, చమురు ఎగుమతులను ఎలా సాగించాలో తమకు బాగా తెలుసని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

ట్రంప్ ‘ఎకనామిక్ డీ-డే’ ప్రకటనకు ఇరాన్ దీటుగా బదులు
ఇరాన్‌కు ఆర్థిక జీవనాధారం కల్పించే ఏ దేశంపై అయినా చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా కఠినమైన ఆంక్షలు విధిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. దీనిని ‘ఎకనామిక్ వార్‌ఫేర్’ మరియు ‘ఎకనామిక్ డీ-డే’గా ఆయన అభివర్ణించారు. ట్రంప్ చేసిన ఈ హెచ్చరికల నేపథ్యంలోనే ఇరాన్ నుంచి ఈ తీవ్రమైన స్పందన వెలువడింది.

విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ వ్యాఖ్యలు
ఈ పరిణామాలపై ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాఘ్చీ కూడా స్పందించారు. అమెరికా గతంలో ప్రయోగించిన ‘గరిష్ఠ ఒత్తిడి’, ‘చరిత్రలోనే అత్యంత కఠినమైన ఆంక్షలు’ వంటి వ్యూహాలన్నీ ఏ విధంగా విఫలమయ్యాయో గుర్తుచేశారు. ఇప్పుడు కొత్తగా చేపట్టిన ఈ ఆర్థిక ఆపరేషన్ కూడా పూర్తిగా విఫలమవడం ఖాయమని ఆయన ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా నొక్కిచెప్పారు.

అగమ్యగోచరంగా మారుతున్న శాంతి చర్చలు
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలను తగ్గించే లక్ష్యంతో ఈ ఏడాది జూన్‌లో అమెరికా, ఇరాన్ దేశాల మధ్య ఒక అవగాహన ఒప్పందం కుదిరింది. అయితే, తాజాగా ఇరు దేశాల మధ్య మళ్ళీ మాటల యుద్ధం తారస్థాయికి చేరడంతో, తుది ఒప్పందంపై జరగాల్సిన కీలక చర్చల భవితవ్యం ప్రస్తుతం పూర్తిగా అగమ్యగోచరంగా మారింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com