ఒమన్‌లో ఆస్తి సంబంధిత నేరాలే అత్యధికం..ఎన్‌సీఎస్‌ఐ నివేదిక..!!

- August 23, 2026 , by Maagulf
ఒమన్‌లో ఆస్తి సంబంధిత నేరాలే అత్యధికం..ఎన్‌సీఎస్‌ఐ నివేదిక..!!

మస్కట్: ఒమన్‌లో 2025లో నమోదైన నేరాల్లో ఆస్తి సంబంధిత నేరాలే అత్యధికంగా ఉన్నట్లు నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ స్టాటిస్టిక్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ (NCSI) తాజా గణాంకాలు వెల్లడించాయి. 2025లో దేశవ్యాప్తంగా సుమారు 21,000 నేరాలు నమోదయ్యాయి. 2024తో పోలిస్తే ఇది 14.8 శాతం పెరుగుదల ఉంది. మొత్తం నేరాల్లో ఆస్తి సంబంధిత నేరాలు దాదాపు 13,000గా, మొత్తం కేసుల్లో 62.3 శాతం వాటాతో మొదటి స్థానంలో నిలిచాయి. ఈ విభాగంలో ఏడాదిలో 33 శాతం పెరుగుదల నమోదైంది.

ఇక వ్యక్తులపై జరిగిన నేరాలు 28.8 శాతంతో రెండో స్థానంలో ఉన్నాయి. ప్రజా పరిపాలన, ప్రజా విశ్వాసానికి సంబంధించిన నేరాలు 3.5 శాతం, మద్యం వినియోగం, బహిరంగ మత్తుకు సంబంధించిన ఉల్లంఘనలు 2.8 శాతం, నైతిక నేరాలు 2.1 శాతంగా నమోదయ్యాయి. 2025లో రోజుకు సగటున 58 నేరాలు నమోదయ్యాయి. 2024లో ఈ సంఖ్య రోజుకు 50గా ఉంది. జనాభాలో ప్రతి 1,000 మందికి 3.9 నేరాల రేటు నమోదైంది.

మస్కట్‌లో అత్యధిక కేసులు

గవర్నరేట్ల వారీగా చూస్తే మస్కట్‌లో అత్యధికంగా 8,916 నేరాలు నమోదయ్యాయి. ఇది దేశవ్యాప్తంగా నమోదైన మొత్తం కేసుల్లో 42 శాతానికి సమానం. అక్కడ ప్రతి 1,000 మందికి 5.8 నేరాల రేటు నమోదైంది. నార్త్‌ అల్‌ బతీనా 3,002 కేసులతో, సౌత్‌ అల్‌ బతీనా 1,985 కేసులతో, దోఫార్‌ 1,827 కేసులతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. అత్యల్పంగా అల్‌ వుస్తాలో 120 నేరాలు నమోదయ్యాయి.

యువకులే అధికం

2025లో నేరాలకు సంబంధించి అరెస్టయిన లేదా అభియోగాలు ఎదుర్కొన్న వారి సంఖ్య 26,847కు చేరింది. 2024లో 24,341గా ఉన్న ఈ సంఖ్య 10 శాతం పెరిగింది. వారిలో పురుషులు 22,869 మంది (85 శాతం) కాగా, మహిళలు 3,978 మంది (15 శాతం) ఉన్నారు. 18 నుంచి 59 ఏళ్ల మధ్య వయసున్న వారే అత్యధికంగా ఉన్నారు. ఈ వయస్సు పరిధిలో 25,524 మంది నమోదయ్యారు. ముఖ్యంగా 30–39 ఏళ్ల వయసువారు 9,647 మందితో (36 శాతం) అతిపెద్ద వర్గంగా నిలిచారు. 18 ఏళ్లలోపు బాల నేరస్తులు 751 మంది ఉన్నారు.
బాధితుల సంఖ్య కూడా పెరుగుదల

2025లో నేరాల కారణంగా ప్రభావితమైన వ్యక్తులు, సంస్థల సంఖ్య 21,900కు చేరింది. 2024తో పోలిస్తే ఇది 14.6 శాతం ఎక్కువ. బాధితుల్లో వ్యక్తులు 17,371 మంది (79 శాతం) ఉన్నారు. వారిలో సుమారు 70 శాతం మంది పురుషులే. వ్యక్తిగత బాధితుల సంఖ్య ఏడాదిలో 32 శాతం పెరిగింది. అయితే ప్రజా హక్కులకు సంబంధించిన కేసులు 52.2 శాతం తగ్గి 1,543కు చేరాయి. ప్రజా సంస్థల రక్షణ, సాధారణ ఉల్లంఘనల నివారణకు చేపట్టిన నియంత్రణ, ముందస్తు చర్యల కారణంగా ఈ తగ్గుదల నమోదైనట్లు గణాంకాలు సూచిస్తున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com