ఎక్స్పో 2030 రియాద్లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- August 26, 2026
పారిస్: ఎక్స్పో 2030 రియాద్లో పాల్గొనేందుకు అధికారికంగా పార్టిసిపేషన్ కాంట్రాక్ట్పై సంతకం చేసిన తొలి దేశంగా ఫ్రాన్స్ నిలిచింది. ఫ్రాన్స్లో సౌదీ క్రౌన్ ప్రిన్స్, ప్రధానమంత్రి మహమ్మద్ బిన్ సల్మాన్ పర్యటన సందర్భంగా ఈ ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందంతో ఆరు నెలల పాటు జరిగే ఎక్స్పోలో ఫ్రాన్స్ అధికారిక భాగస్వామ్యానికి మార్గం సుగమమైంది. ఫ్రాన్స్ పెవిలియన్ ఏర్పాటు చేయనున్న ప్రదేశం, కేటాయించిన స్థలం, పెవిలియన్ థీమ్తో పాటు సందర్శకులు, వ్యాపార సంస్థలకు అందించనున్న అనుభవానికి సంబంధించిన ప్రాథమిక అంశాలను ఒప్పందంలో పేర్కొన్నారు.
పారిస్లో జరిగిన ఒప్పంద సంతకాల కార్యక్రమానికి సౌదీ విదేశాంగ మంత్రి ప్రిన్స్ ఫైసల్ బిన్ ఫర్హాన్, బ్యూరో ఇంటర్నేషనల్ డెస్ ఎక్స్పోజిషన్స్ (BIE) సెక్రటరీ జనరల్ డిమిత్రి ఎస్. కెర్కెంట్జెస్ హాజరయ్యారు. ఎక్స్పో 2030 రియాద్ సీఈఓ తలాల్ అల్-మర్రీ, కంపానీ ఫ్రాంసైస్ డెస్ ఎక్స్పోజిషన్స్ (COFREX) చైర్మన్ జాక్వెస్ మేర్ ఒప్పందంపై సంతకాలు చేశారు.
ఫ్రాన్స్ పెవిలియన్ను ఎక్స్పోలోని ‘ప్లానెట్’ డిస్ట్రిక్ట్లో ఏర్పాటు చేయనున్నారు. దీనికి ‘అండర్ వన్ స్కై’ అనే థీమ్ను ఎంపిక చేశారు. ఆకాశం, భూమి, అగ్ని, నీరు అనే నాలుగు మూలకాల ఆధారంగా పెవిలియన్ను రూపొందించనున్నారు. జలకు అర్థవంతమైన, ఆకట్టుకునే అనుభవాన్ని అందించడంతో పాటు పర్యావరణ పరిరక్షణ, పర్యావరణ మార్పు దిశగా ఫ్రెంచ్ సంస్థల సామర్థ్యాలు, ఆవిష్కరణలను ప్రపంచానికి పరిచయం చేయడం తమ లక్ష్యమని COFREX చైర్మన్ జాక్వెస్ మేర్ తెలిపారు.
ఎక్స్పో 2030 రియాద్ 2030 అక్టోబర్ 1 నుంచి 2031 మార్చి 31 వరకు జరగనుంది. “ఫోర్సైట్ ఫర్ టుమారో” (భవిష్యత్తు కోసం ముందుచూపు) అనే థీమ్తో ఆరు నెలల పాటు ఈ అంతర్జాతీయ ప్రదర్శన నిర్వహించనున్నారు. ఎక్స్పోలో 200కు పైగా అధికారిక భాగస్వాములు పాల్గొంటారని, సుమారు 4.2 కోట్ల సందర్శనలు నమోదవుతాయని అంచనా వేస్తున్నారు. దేశాల పెవిలియన్లు, సాంస్కృతిక కార్యక్రమాలు, సాంకేతిక ఆవిష్కరణలు, ఇంటరాక్టివ్ అనుభవాల ద్వారా ప్రపంచ దేశాలు, సంస్థలు ఒకే వేదికపై ఆలోచనలు పంచుకోవడం, భాగస్వామ్యాలను ఏర్పరచుకోవడం, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉమ్మడి సవాళ్లకు పరిష్కారాలను అన్వేషించడం కోసం ఎక్స్పో వేదికగా నిలవనుంది.
ఎక్స్పో ముగిసిన అనంతరం ఈ ప్రాంగణాన్ని శాశ్వత గ్లోబల్ విలేజ్గా అభివృద్ధి చేయాలని సౌదీ అరేబియా ప్రణాళిక రూపొందించింది. తద్వారా రియాద్తో పాటు సౌదీ అరేబియా, ప్రపంచానికి దీర్ఘకాలిక వారసత్వంగా ఈ ప్రాజెక్టు నిలిచేలా చర్యలు తీసుకోనున్నారు.
తాజా వార్తలు
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్ఎయిర్ ఫ్లైట్స్..!!
- ఖతార్లో డ్రోన్ల వినియోగంపై అవగాహన..!!
- ఇరాన్ పై కొత్తగా సైనిక దాడులు చేయం..మార్కో రూబియో
- UAE ప్రభుత్వ పాఠశాలల్లో KG నుంచి 2వ తరగతి వరకు హోంవర్క్ రద్దు







